మహిళల భద్రత కోసం అభయ కోటు.!ధరిస్తే పడదు వేటు.!ఆవిష్కరించిన ఎమ్మెల్సీ కవిత.!
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో మహళల భద్రతకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. ఆబిడ్డల భద్రత కోసం హైదరాబాద్ యువకులు రూపొందించిన అభయ కోటు ను కవిత ఆవిష్కరించారు. సమాజంలో మహిళలకు ప్రత్యేక భద్రత కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటుందన్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. మహిళల రక్షణ కోసం హైదరాబాద్ యువకులు రూపొందించిన 'అభయ కోట్' అనే ప్రత్యేక సేఫ్టీ జ్యాకెట్ ను ఎమ్మెల్సీ కవిత ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడారు. మహిళల భద్రత ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ప్రధాన ఎజెండా అన్నారు. మహిళల రక్షణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా షీ టీంలు ఏర్పాటు చేసామన్న ఎమ్మెల్సీ కవిత, ఆడబిడ్డలపై అఘాయిత్యాలకు పాల్పడిన వారిపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కు పాదం మోపుతుందన్నారు.
Recommended Video
దివ్యాంగ మహిళల రక్షణ కోసం ప్రత్యేక పరికరాలను రూపొందించిన యువకులు దినేష్, శశాంక్ రెడ్డి, దినేష్ రెడ్డిలను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అభినందించారు. వీరు రూపొందించిన ఈ ప్రత్యేక కోట్ వినికిడి, మాట్లాడడం సమస్య ఉన్న మహిళలకు ఎంతగానో ఉపయోగపడుతుందని, ఎలాంటి సందర్భంలోనైనా ప్యానిక్ బటన్ ప్రెస్ చేస్తే వెంటనే సైరన్ మోగడంతో పాటు, ఎలక్ట్రిక్ షాక్ కూడా వచ్చేలా ప్రత్యేక జాకెట్ లో పొందుపరిచారని వివరించారు కవిత. అత్యవసర పరిస్థితుల్లో మహిళ ఆత్మరక్షణకు, ఇతరులను అప్రమత్తం చేయడానికి ఈ ప్రత్యేక జాకెట్ ఎంతగానో ఉపయోగపడుతుందని కవిత అన్నారు. అంతేకాకుండా కుటుంబ సభ్యులకు, సమీపంలోని పోలీస్ స్టేషన్ కు లొకేషన్ మెసేజ్ వెళ్లేందుకు సైతం ప్రత్యేక జీపీఎస్ వ్యవస్థను ఈ కోట్ లో అమర్చారని ఎమ్మెల్సీ కవితి వివరించారు. ఉద్యోగం కోసం దూర ప్రాంతాలకు వెళ్లే మహిళలు, ముఖ్యంగా అర్ధరాత్రి నైట్ షిఫ్ట్ చేసే మహిళలకు ఈ జాకెట్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని కవిత పేర్కొన్నారు.