ఇక ఆపండి.. 'స్వామి గౌడ్' విషయంలో మాది పొరపాటే: ఏబీఎన్
హైదరాబాద్: మండలి చైర్మన్ స్వామి గౌడ్ కంటి గాయం చుట్టూ ఇప్పుడు తెలంగాణ రాజకీయాలు తిరుగుతున్నాయి. పరిస్థితి కార్నియా దెబ్బతినేదాకా వెళ్లిందని టీఆర్ఎస్ అంటుంటే.. అబ్బే అదంతా వట్టి డ్రామా అని కాంగ్రెస్ కొట్టిపారేస్తోంది. ఇలాంటి తరుణంలో.. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రసారం చేసిన కొన్ని దృశ్యాలు చాలామందిని ఆశ్చర్యపరిచాయి.
ఏబీఎన్ వీడియోలో ఎడమ కన్ను?..
స్వామిగౌడ్ కుడి కన్నుకు గాయమైతే.. ఏబిఎన్ ప్రసారం చేసిన వీడియోలో మాత్రం ఎడమ కన్నుకు గాయమైనట్టుగా కనిపించింది. దీంతో కేసీఆర్ స్వామి గౌడ్తో నిజంగానే డ్రామా ఆడిస్తున్నాడా?.. ఒక టీవి చానెల్లో కుడి కన్నుకు మరో టీవి చానెల్లో ఎడమ కన్నుకు గాయమైనట్టు కనిపించడమేంటి? అన్న ప్రశ్నలు తలెత్తాయి.
కేసీఆర్ నిజంగా అలా అన్నారా?: ఆంధ్రజ్యోతి ఎందుకలా రాసింది..
ఏబీఎన్ వివరణ..:
స్వామి గౌడ్ కంటి గాయంపై ఏబీఎన్ ప్రసారం చేసిన దృశ్యాలతో సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడుస్తోంది. కాంగ్రెస్ చెప్పిందే కరెక్ట్ అని టీఆర్ఎస్ డ్రామా ఆడుతుందని కొంతమంది నెటిజెన్స్ మండిపడుతున్నారు. ఇంతలో తప్పు గుర్తించారో ఏమో కానీ ఏబీఎన్ నుంచి వివరణ రానే వచ్చింది.
మిర్రర్ ఎఫెక్ట్ వల్లే.. ఆ తప్పిదం:
వాస్తవానికి స్వామి గౌడ్ కుడి కన్నుకే గాయమైందని.. సాంకేతిక తప్పిదం కారణంగా ఎడమ కన్నుకు గాయమైనట్లు ఏబీఎన్లో ప్రసారమైందని ఆ చానెల్ వివరణ ఇచ్చింది. మిర్రర్ ఎఫెక్ట్ వాడటం వల్లే ఇలా జరిగిందని తెలిపింది.
వార్తల్లో మాత్రం కుడికన్ను అనే..:
ఏబీఎన్ ప్రసారం చేసిన వీడియో క్లిప్పింగ్స్తో కొంతమంది సోషల్ మీడియాలో ఉద్దేశపూర్వకంగా కొన్ని ప్రచారాలు చేస్తున్నారని, ఇక వాటికి ఫుల్ స్టాప్ పెట్టాలని కోరుతున్నట్టు ఏబీఎన్ విజ్ఞప్తి చేసింది. పొరపాటును గుర్తించిన తక్షణమే సరిదిద్దామని, వీడియో క్లిప్పింగ్స్ లో ఎలా ఉన్నా.. వార్తల్లో మాత్రం కుడి కన్నుకే గాయమైందని చెప్పామని వెల్లడించింది.