సివిల్స్ ప్రిలిప్స్ ఫలితాలు: ఏపీ, తెలంగాణ నుంచి 600మంది ఉత్తీర్ణత
హైదరాబాద్: సివిల్స్ ప్రాథమిక పరీక్షల్లో తెలుగు రాష్ట్రాలు సత్తా చాటారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి సుమారు 600 మందికిపైగా అభ్యర్థులు ఉత్తీర్ణులయ్యారు. దేశవ్యాప్తంగా జూన్ 3న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించగా మూడు లక్షల మందికిపైగా హాజరయ్యారు.
ఏపీ, తెలంగాణ నుంచి 39,027 మంది పరీక్ష రాశారు. పరీక్ష ఫలితాలను యూపీఎస్సీ శనివారం విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 13,336 మంది ప్రధాన పరీక్ష రాసేందుకు అర్హత సాధించారు. వారిలో తెలుగు రాష్ట్రాల నుంచి 600 మందికిపైగా ఉంటారని నిపుణులు చెబుతున్నారు.
ప్రధాన పరీక్ష సెప్టెంబరు 28నుంచి 30వరకు జరుగుతాయి. మళ్లీ రెండో భాగం పరీక్షలు అక్టోబరు 6 నుంచి మొదలవుతాయి. తెలంగాణలో హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో పరీక్ష నిర్వహిస్తారు. గత సంవత్సరం వరకు ప్రాథమిక పరీక్ష పూర్తయిన 60 రోజుల తర్వాత ఫలితాలు విడుదలయ్యేవి.
వీరప్ప మెయిలీ నేతృత్వంలో ఏర్పాటైన రెండో పరిపాలనా సంస్కరణల కమిషన్ పరీక్షల నిర్వహణ వ్యవధిని తగ్గించాలని, ప్రాథమిక పరీక్ష పూర్తయిన తర్వాత రెండు నెలల్లో ప్రధాన పరీక్షలు జరపాలని సిఫార్సు చేసింది. ఈనేపథ్యంలో ఈసారి యూపీఎస్సీ 39రోజుల్లోనే ఫలితాలు విడుదల చేసింది.