మజ్లిస్పై బీజేపీ బడా ప్లాన్: అక్బరుద్దీన్పై ఓయు విద్యార్థిని షెహజాదీ పోటీ, ఎవరీమే?
హైదరాబాద్: మజ్లిస్ పార్టీని దెబ్బతీసేందుకు బీజేపీ కొత్త ప్లాన్ వేసింది. ప్రతిసారి లోకసభ ఎన్నికల్లో హైదరాబాద్ లోకసభ నియోజకవర్గంలో మజ్లిస్, బీజేపీ మధ్య హోరాహోరీ ఉంటుంది. గత ఎన్నికల్లో మజ్లిస్ అధ్యక్షులు అసదుద్దీన్ భారీ మెజార్టీతో గెలిచారు. అయితే తొలుత ఓటింగ్ సమయంలో ఓ దశలో బీజేపీ గెలుస్తుందా అనే చర్చ కూడా సాగింది. చివరకు అసదుద్దీన్ రెండు లక్షలకు పైగా ఓట్లతో గెలిచారు.
పవన్పై తెలంగాణ నేతల ఒత్తిడి, కేసీఆర్ వైపేనా.. ఇదీ లెక్క: అదే జరిగితే బాబు-జగన్లకు దొరికినట్లే!
పాతబస్తీలో ఎప్పటి నుంచో బీజేపీ, మజ్లిస్ పార్టీల మధ్య హోరాహోరీ ఉంది. అయితే గత కొంతకాలంగా మజ్లిస్ అక్కడ గెలుస్తూ వస్తోంది. బీజేపీ ఇక్కడ పట్టు కోసం ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లిస్ కీలక నేతపై బీజేపీ దృష్టి సారించింది. అక్బరుద్దీన్ ఓవైసీ పోటీ చేసే చాంద్రాయణగుట్ట నుంచి బీజేపీ తరఫున ఓ ముస్లీం యువతిని బరిలోకి దించనుంది.
ఎవరీ సయ్యద్ షెహజాదీ?
ఆమెనే సయ్యద్ షెహజాదీ. ఆమె అదిలాబాద్కు చెందిన ఏబీవీపీ నాయకురాలు. గతంలో బీజేపీ కార్యవర్గ సభ్యురాలిగా పని చేశారు. ఇటీవలే ఆమె తెలంగాణ బీజేపీ అధ్యక్షులు డాక్టర్ కే లక్ష్మణ్ ఆధ్వర్యంలో కమలం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆమె కొన్నేళ్ల పాటు ఏబీవీపీలో కీలకంగా పని చేశారు. అదిలాబాద్ మహిళా కళాశాల ఏబీవీపీ అధ్యక్షురాలిగా పని చేశారు. పట్టణ సంయుక్త కార్యదర్శిగా, జిల్లా ఏబీవీపీ మహిళా సెల్ కన్వీనర్గా, రెండుసార్లు రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా పని చేశారు.
ఉస్మానియా విద్యార్థిని
షెహజాదీ ఉస్మానియా యూనివర్సిటీలో మహిళా విభాగం అధ్యక్షురాలిగా పని చేశారు. ఉస్మానియాలో పీజీ పొలిటికల్ సైన్స్ కోర్స్ చేశారు. జాతీయ కార్యవర్గ సభ్యురాలిగా ఉన్నారు. ఇప్పుడు షహనాజ్ బీజేపీలో చేరారు. ఆమె అక్బరుద్దీన్ ఓవైసీ ప్రాతినిథ్యం వహిస్తున్న చాంద్రాయణగుట్ట నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఖరారు కావాల్సి ఉంది.
ప్రధాని మోడీ సంస్కరణలు ప్రచారం చేస్తాం
ప్రధాని నరేంద్ర మోడీ చేపట్టిన సంస్కరణలు, దేశభద్రత, జాతీయభావాలపై విస్తృతంగా ప్రచారం చేస్తానని షెహజాదీ అన్నారు. ఆమె ఓ టీవీ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. ముస్లీం మహిళలను చిన్నచూపు చూస్తున్న అక్బరుద్దీన్ ఓటమే తన లక్ష్యమని ఆమె చెప్పారు. అక్బరుద్దీన్ ముస్లీం అని చెప్పుకుంటాడని, కానీ ఆ వర్గానికి చేసిందేమీ లేదన్నారు. ముస్లీం అనే పేరును ఉపయోగించుకొని వారు సొంత ఆస్తులు పెంచుకుంటున్నారని ఆరోపించారు. పాతబస్తీ ముస్లీంలను భ్రమల్లో ఉంచుతున్నారన్నారు.
ట్రిపుల్ తలాక్ను సమర్థిస్తే ఇస్లాం వ్యతిరేకులే
ఓవైసీ విద్యాసంస్థలు, ఆసుపత్రుల్లో ఎంతమంది ముస్లీం పేదలకు సేవలు అందిస్తున్నారో చెప్పాలని షెహజాదీ ప్రశ్నించారు. తనకు అక్బరుద్దీన్ పైన పోటీ చేసేందుకు అవకాశమివ్వండని, నేను చరిత్ర సృష్టించి చూపిస్తానని తెలంగాణ బీజేపీ అధిష్టానానికి చెప్పానని అన్నారు. ఇస్లాం, ఖురాన్లలో ట్రిపుల్ తలాక్ అంశం ప్రస్తావన లేదన్నారు. ట్రిపుల్ తలాక్ మా మతానికి సంబంధించిన అంశమని వారు చెబుతారని, మీకు దమ్ముంటే నాతో చర్చకు సిద్ధం కావాలన్నారు. ట్రిపుల్ తలాక్ను సమర్థిస్తే ఇస్లాంను వ్యతిరేకిస్తున్నట్లే అన్నారు.
ఒక్క అవకాశం ఇవ్వండి
మహిళలు ఎప్పుడూ మీకు బానిసలుగా ఉండాలా అని షెహజాదీ ప్రశ్నించారు. భారత్ లౌకిక దేశమని, పాకిస్తాన్, బంగ్లాదేశ్ వంటి దేశాలలోనే ట్రిపుల్ తలాక్ను రద్దు చేశారని, అలాంటి ట్రిపుల్ తలాక్ను పట్టుకొని ఎందుకు వేలాడుతున్నారని ప్రశ్నించారు. ఈ దేశాన్ని ప్రేమించే ముస్లీంలు ఉంటారని చెప్పడానికే తాను చాంద్రాయణగుట్ట నుంచి పోటీ చేస్తున్నానని చెప్పారు. ముస్లీం అమ్మాయిలను దుబాయ్కి అమ్మినప్పుడు ఎందుకు మాట్లాడటం లేదన్నారు. తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని చాంద్రాయణగుట్ట ప్రజలను కోరారు. పాతబస్తీ నుంచి ఒక్క అమ్మాయిని కూడా దుబాయ్కు అమ్మకుండా చేస్తానని చెప్పారు.
జాతీయ భావాలు కలిగిన ముస్లీం మహిళను
నేను ఏబీవీపీలో పని చేశానని, తొమ్మిదేళ్లపాటు పని చేశానని షెహజాదీ చెప్పారు. తాను పదో తరగతిలో ఉన్నప్పుడే వివేకానంద స్వామి జీవిత చరిత్ర చదివానని, ఆయన చరిత్ర చదివాక ఏబీవీపీలో పని చేయాలని నిర్ణయించుకున్నానని, కానీ తాను ఇస్లాంనే అనుసరిస్తానని చెప్పారు. కానీ తాను జాతీయ భావాలు కలిగిన ముస్లీం మహిళను అని చెప్పారు. తనకు అందరూ సమానమని చెప్పారు. ఇస్లాంకు ప్రాధాన్యత ఇస్తూనే, అందరినీ గౌరవిస్తానని, గణేష్ పూజల్లోను పాల్గొంటానని చెప్పారు. ఈ దేశం, ఈ ధర్మం, ఇస్లాం ధర్మం చాలా గొప్పది అన్నారు. ఇస్లాం ఇతర మతాలను విమర్శించకూడదని స్పష్టంగా చెప్పిందని, అలా విమర్శలు చేసేవారు ఇస్లాం ద్రోహులు అవుతారన్నారు.
అక్బరుద్దీన్పై గెలిచి చరిత్ర సృష్టిస్తా
అక్బరుద్దీన్ ఓవైసీ పైన గెలుపే లక్ష్యంగా తాను పోటీ చేస్తున్నానని షెహజాదీ చెప్పారు. ఆయనపై గెలిచి చరిత్ర సృష్టిస్తానని అన్నారు. ఒక్కసారి అవకాశం ఇవ్వాలని పార్టీ అధిష్టానాన్ని కోరానని, వారు దీనిపై ఆలోచన చేస్తున్నారని చెప్పారు. పాతబస్తీలో తాను కచ్చితంగా చరిత్ర సృష్టిస్తానని ఆమె అన్నారు. తాను ఎంఏ పొలిటికల్ సైన్స్ పూర్తి చేశానని అన్నారు. ఎంఏ హిందీ చేస్తున్నానని, పీహెచ్డీ కూడా చేస్తానని, జాతీయవాదం పైన కూడా చేయాలని తన ఆలోచన అన్నారు. అలాగే, అణిచివేయబడిన ముస్లీం మహిళలను బయటకు తీసుకురావాలని తాను రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. పాతబస్తీ ఎందుకు అభివృద్ధి చెందలేదని ప్రశ్నించారు. అభివృద్ధి జరిగితే మజ్లిస్కు ప్రజలు మద్దతివ్వరని వాళ్ల భయమన్నారు.