రణరంగాన్ని తలపించిన అసెంబ్లీ: గ్రూపులుగా వచ్చిన ఏబీవీపీ స్టూడెంట్స్, విద్యారంగ కేటాయింపులపై ఫైర్..
తెలంగాణ ప్రభుత్వం విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తుందని ఏబీవీపీ విద్యార్థి సంఘం చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారింది. ప్రభుత్వ తీరును నిరసిస్తూ విద్యార్థి సంఘం నేతలు ఛలో అసెంబ్లీ ముట్టడించడంతో.. అసెంబ్లీ గేటు వద్ద రణరంగాన్ని తలపించింది. పదుల సంఖ్యలో విద్యార్థి, విద్యార్థిని నేతలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసి, గేటు దూకేందుకు ప్రయత్నించి పోలీసులకు చెమటలు పట్టించారు. అసెంబ్లీ గేటు వద్ద ఉన్న విద్యార్థులను అదుపులోకి తీసుకొని.. పరిస్థితి కంట్రోల్ చేయడానికి పోలీసులకు అరగంటకు పైగానే పట్టింది.
విద్యారంగంపై నిర్లక్ష్యం..
విద్యార్థులు ఒక్కసారిగా రావడం, గ్రూపులు.. గ్రూపులుగా వచ్చి వ్యుహాత్మకంగా వ్యవహరించారు. దీంతో విద్యార్థులను అదుపులోకి తీసుకోవడానికి చాలా సమయం పట్టింది. ఇంతలో విద్యార్థులు గేటు ఎక్కి పోలీసుల గుండెల్లో గుబులు రేపారు. విద్యారంగాన్ని సీఎం కేసీఆర్ నిర్లక్యం చేస్తున్నారని స్టూడెంట్స్ ఆగ్రహాం వ్యక్తం చేశారు. మహిళా విద్యార్థులు కూడా ఆందోళనలో పాల్గొని.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
రీయింబర్స్మెంట్ ఏదీ..?
ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయి వెంటనే విడుదల చేయాలని విద్యార్థులు నినాదాలు చేశారు. రీయింబర్స్ మెంట్ ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో తమకు స్కాలర్ షిప్ రావడం లేదని చెప్పారు. బడ్జెట్లో కేటాయించిన రూ.3 వేల కోట్లు వెంటనే విడుదల చేయాలని కోరారు. వర్సిటీల్లో ఖాళీలను ఎప్పుడూ భర్తీ చేస్తారు అని ప్రశ్నించారు. విశ్వవిద్యాలయాల్లో వైస్ చాన్స్లర్ పోస్ట్ ఖాళీగా ఉండటం ఏంటీ అని ధ్వజమెత్తారు. టీచర్ పోస్టులను కూడా పిలప్ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 50 వేల టీచర్ పోస్టులను భర్తీ చేయాల్సి ఉందని గుర్తుచేశారు.
Recommended Video
6 శాతం నిధులా..?
విద్యారంగంపై కేసీఆర్ ప్రభుత్వం వివక్ష చూపుతోందని విద్యార్థులు మండిపడ్డారు. ఎంత చిన్నచూపు లేకుంటే బడ్జెట్లో 6 శాతం నిధులను విద్యారంగానికి కేటాయిస్తారా అని ప్రశ్నించారు. కేజీ టు పీజీ ఉచిత విద్య అని మభ్యపెడుతున్నారే తప్ప.. అమలు చేయడం లేదని విమర్శించారు. విద్యారంగంపై ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని మండిపడ్డారు. నిరసన చేపట్టిన విద్యార్థులను పోలీసులు వాహనాల్లో సమీపంలోని పోలీసుస్టేషన్కు తరలించారు.