ఏసీబీ ఏఎస్పీ సునీతారెడ్డిపై సస్పెన్షన్ వేటు
Recommended Video
హైదరాబాద్: పోలీస్శాఖలో అనైతిక వ్యవహారంపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. తన వివాదాస్పద వ్యవహారశైలితో పోలీస్శాఖ పరువు తీసిందనే ఆరోపణలపై ఏసీబీ ఏఎస్పీ సునీతారెడ్డిపై సస్పెన్షన్ వేటు వేస్తూ ఉత్తర్వులు జారీచేసింది.
ఏసీబీ ఏఎస్పీ సునీతారెడ్డి, కల్వకుర్తి సీఐ మల్లికార్జునరెడ్డిల వ్యవహారాన్ని సునీత భర్త సురేందర్ రెడ్డి రెడ్ హ్యాండెడ్గా బయటపెట్టడం, ఈ అనైతిక వ్యవహారంపై డీజీపీకి ఫిర్యాదు చేసి సీఐ మల్లికార్జున రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరడం తెలిసిందే.
డీజీపీ నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఈ మేరకు ఏఎస్పీ సునీతను సస్పెండ్ చేస్తూ మంగళవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే ఈ కేసులో సీఐ మల్లికార్జున్ రెడ్డిపై ఐజీ స్టీఫెన్ రవీంద్ర వేటు వేశారు. మల్లికార్జున్ రెడ్డిపై మాదాపూర్ పీఎస్లో కేసు కూడా నమోదైంది.
రాసలీలల వ్యవహారంపై ఏసీబీ ఏఎస్పీ సునీతారెడ్డి ఇంటికి మంగళవారం కేపీహెచ్బీ పోలీసులు వెళ్లారు. అక్కడ ఆమె స్టేట్మెంట్ను వారు రికార్డు చేశారు. అలాగే సీఐ మల్లికార్జున్రెడ్డిని కూడా పోలీసులు ప్రశ్నించారు.
అనంతరం ఈ వ్యవహారానికి సంబంధించి ఐజీ స్టీఫెన్ రవీంద్ర డీజీపీకి తన నివేదిక అందజేశారు. ఈ నివేదిక ఆధారంగా ఏఎస్పీ సునీతను సస్పెండ్ చేయాల్సిందిగా డీజీపీ ప్రభుత్వానికి నివేదించారు. దీంతో ప్రభుత్వం ఈ మేరకు చర్యలు తీసుకుంది.