కోర్టు ముందుకు బాబు స్వరంపై నివేదిక: నోటుకు ఓటుపై పునర్విచారణ
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించిన నోటుకు ఓటు కేసు మళ్లీ తెర మీదికి వచ్చింది. ఈ కేసును పునర్విచారణ చేయాలని ఎసిబి కోర్టు తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఎసిబి)ని ఆదేశించింది. వచ్చే నెల 29వ తేదీలోగా ఈ విచారణను పూర్తి చేయాలని ఎసిబిని కోర్టు ఆదేశించింది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి స్వరంపై ఫోరెన్సిక్ పరీక్షల వినేదికను వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి చెందిన మంగళగిరి శాసనసభ్యుడు ఆళ్ల రామకృష్ణా రెడ్డి కోర్టు ముందు ఉంచారు. ఈ నివేదిక ఆధారంగా కేసును తిరిగి విచారించాలని విజ్ఞప్తి చేశారు.
పిటిషనర్ వాదనలతో ఎసిబి కోర్టు ఏకీభవించింది. ఆళ్ల రామకృష్ణా రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై ఆయన తరఫు న్యాయవాది పొన్నపోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. ఓటుకు నోటు కేసులో సరైన విచారణ జరగలేదని ఆయన అన్నారు. ఫోరెన్సిక్ నివేదికను పరిగణనలోకి తీసుకుని ఉత్తర్వులు ఇవ్వాలని ఆయన కోర్టును కోరారు. తిరిగి విచారణ జరిపించేలా ఆదేశాలు ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు .
దాదాపు ఏడాది క్రితం నోటుకు ఓటు కేసు వెలుగు చూసింది. అప్పట్లో తెలంగాణ ఎమ్మెల్సీ స్టీఫెన్సన్తో చంద్రబాబు మాట్లాడినట్లు చెబుతున్న ఆడియో టేపులు కత్తిరించి అతికించినవా, వాస్తవమైనవా అనే విషయంపై తన నివేదికను ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ సమర్పించింది. ఆ స్వరం చంద్రబాబుదేనని నివేదికలో తేలినట్లు చెబుతున్నారు.
తాజాగా, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి పలు సందర్భాల్లో చంద్రబాబు మాట్లాడిన మాటల స్వర నమూనాలను, ఓటుకు నోటు కేసులో వినపడిన సంభాషణలను అంతర్జాతీయంగా ప్రసిద్ధి పొందిన ఓ ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు ఈ ల్యాబ్ అందించిన నివేదికలో కూడా ఆ స్వరం చంద్రబాబుదేనని తేలినట్లు సమాచారం. వాటి ఆధారంగా రామకృష్ణా రెడ్డి ఎసిబి కోర్టులో కేసు దాఖలు చేశారు.