'ఓటుకు నోటుపై రాజీ': ఏ1గా.. బాబుపై ఎఫ్ఐఆర్కు ఛాన్స్! ఏం జరిగింది?
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రమేయం ఉందనే విషయం అందరికీ తెలిసిందేనని, ఈ కేసు విషయంలో అప్పట్లో ఇరు రాష్ట్రాల సీఎంలు సవాళ్లు విసురుకున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ రంగారెడ్డి అన్నారు.
కోర్టు ఆర్డర్, ఓటుకు నోటు షాక్: 'మోడీ-కేసీఆర్ కూడా బాబును కాపాడలేరు'
ఆయన సోమవారం నాడు విలేకరులతో మాట్లాడారు. ఓటుకు నోటు కేసులో ఏపీ సీఎం చంద్రబాబు ప్రమేయం ఉందన్నారు. దీనిపై తెలంగాణ సీఎం కేసీఆర్, చంద్రబాబులు అప్పుడు ఏం మాట్లాడారో అందరికీ తెలుసునని అభిప్రాయపడ్డారు. ఆ తర్వాత రాజకీయ అవసరాల కోసం రాజీపడ్డారని విమర్శించారు.
అవినీతికి వ్యతిరేకం అని చెబుతున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏసీబీ కోర్టు ఆదేశాలతోనైనా ఓటుకు నోటు కేసును తేల్చాలని ఆయన డిమాండ్ చేశారు.
ఏం జరిగింది? ఎఫ్ఐఆర్ నమోదు అవకాశం
ఏడాది క్రితం సంచలనం రేపిన ఓటుకు నోటు కేసులో మళ్లీ తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ కేసులో చంద్రబాబుపై ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు సంప్రదింపులు జరుపుతున్నట్లు ఏసీబీ అధికారి నమస్తే తెలంగాణకు చెప్పినట్లుగా వార్త వచ్చింది.
మంగళవారం నాడు కోర్టు ఆదేశాల మేరకు సమావేశం జరగనుందని, ఈ సమావేశంలో ఎఫ్ఐఆర్ నమోదు చేసే ప్రక్రియను వేగవంతం చేసేందుకు నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయని కూడా ఆయన చెప్పినట్లు వార్త వచ్చింది. గతంలో ఉన్న ఎఫ్ఐఆర్ను మార్చి ఏ1గా చంద్రబాబు పేరు పెట్టే అవకాశాలున్నట్లుగా కూడా ఆయన వెల్లడించారట.
కాగా, గత ఏడాది ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యే స్టీఫెన్సన్ ఓటు కొనుగోలుకు జరిగిన ప్రయత్నంలో టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అరెస్టైన విషయం తెలిసిందే.
ఈ కేసులో చంద్రబాబు స్వరంగా భావిస్తున్న మనవాళ్లు బ్రీఫ్డ్మీ సంభాషణపై స్పష్టత వచ్చింది. ఆ గొంతు ఏపీ సీఎం చంద్రబాబుదేనని ముంబైకి చెందిన హెలిక్ డిజిటల్ ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదికలో తేటతెల్లమైందని అంటున్నారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబుపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి, దర్యాప్తు చేయాలంటూ ఏపీలోని మంగళగిరి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై సోమవారం విచారించిన కోర్టు.. సెప్టెంబర్ 29లోపు దర్యాప్తు పూర్తిచేసి నివేదిక సమర్పించాలని ఏసీబీ డీజీని ఆదేశించింది. దీంతో మళ్లీ కదలిక ప్రారంభమైంది. చంద్రబాబు గొంతుపై రాష్ట్ర ఎఫ్ఎస్ఎల్ ఇచ్చిన నివేదికతోపాటు, తాజాగా రామకృష్ణారెడ్డి ఇచ్చిన ముంబై హెలిక్ ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఏసీబీకి మరింత బలమైన ఆధారాన్ని ఇచ్చినట్టయిందని అంటున్నారు.
ఫోరెన్సిక్ ల్యాబ్లలో మంచి పేరున్న హెలిక్ ఫోరెన్సిక్ ల్యాబ్ ఆడియోలో ఉన్నది బాబు గొంతేనని స్పష్టంగా చెప్పడంతో ఇక నేరుగా చంద్రబాబుపై చర్యలకు లైన్క్లియర్ అయ్యినట్టేనని అభిప్రాయపడుతున్నారని అంటున్నారు.
నాటి టేపులతో...
2014లో జరిగిన ఇండియన్ ఎకనమిక్ సమ్మిట్లో చంద్రబాబు చేసిన ప్రసంగం టేపులతో స్టీఫెన్సన్తో సంభాషించినట్టు చెప్తున్న ఆడియోను పోల్చి చూసిందని తెలుస్తోంది. సీఫెన్సన్తో మాట్లాడిన గొంతు చంద్రబాబుదేనని తెలిసిందని సమాచారం. సైంటిస్ట్ సీమా కోటల్వార్ ఈ పరీక్ష నిర్వహించగా, సైంటిస్ట్ అమెయి జే చూరీ ధ్రువీకరిస్తూ నివేదిక ఇచ్చారని అంటున్నారు.
టిడిపిలో కలకలం
తాజా వ్యవహారంతో టిడిపి శిబిరంలో మళ్లీ కలవరం రేగింది. ముగిసిపోయిందనుకున్న ఓటుకు నోటు కేసులో కీలక మలుపు ఎదురవడంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తాజా పిటిషన్లో ఏసీబీ ఎలాంటి చర్యలకు సిద్ధమవుతుందన్న అంశం రెండు రాష్ట్రాలతో దేశవ్యాప్తంగా ఆసక్తి రేపుతోంది.
మే 31న నుంచి ఇప్పటి వరకు...
గతేడాది మే 31న అప్పటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థిని గెలిపించుకునేందుకు ఎమ్మెల్యేల కొనుగోలు కుట్రకు టిడిపి తెరలేపిందని ఆరోపణలు వచ్చాయి. ఇందులో భాగంగా రేవంత్ రెడ్డి తెలంగాణ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ను కలిసి, తమ అభ్యర్థికి ఓటువేస్తే రూ.5కోట్లు ఇస్తామని చెప్పి, అడ్వాన్స్గా రూ.2.50కోట్లు ఇస్తూ దొరికారు.
అదే రోజు ఏసీబీ అధికారులు ఈ విషయంలో కేసు నమోదు చేశారు. ఆ తర్వాత ఏసీబీ రేవంత్తో పాటు ఉదయ్సింహా, సెబాస్టియన్లను అరెస్ట్ చేసి జైలుకు పంపించింది. ఇదే కేసులో ఆరోపణలెదుర్కొన్న సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యను కూడా ఏసీబీ అరెస్ట్ చేసి కస్టడీలోకి ప్రశ్నించింది.
ఇలా పలువురు టీడీపీ నేతలు కూడా ఏసీబీ ప్రశ్నలు ఎదుర్కొన్నారు. స్టీఫెన్సన్తో టీడీపీ అధినేత చంద్రబాబు ఫోన్లో మాట్లాడినట్టు పేర్కొంటున్న టేపుల వ్యవహారంపై ఎఫ్ఎస్ఎల్ కూడా కోర్టుకు నివేదిక సమర్పించింది.
ఆ సంభాషణలో స్టీఫెన్సన్తో మాట్లాడింది చంద్రబాబేనని తన నివేదికలో వెల్లడైనట్లుగా వార్తలొచ్చాయి. మరింత స్పష్టత కోసం.. ఆయన గొంతుకు సంబంధించిన నివేదిక తప్ప మిగిలిన అన్ని అంశాలపై ఏసీబీ గతేడాది జూలై 29న చార్జిషీటు దాఖలు చేసింది.
అయితే ఇప్పటివరకు ఆ చార్జిషీటును కోర్టు పరిగణలోకి తీసుకోలేదు. చంద్రబాబు సంభాషణల టేపులపై ఏసీబీ అధికారులు సరైన దర్యాప్తు జరపలేదని, తిరిగి దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ మంగళగిరి శాసనసభ్యుడు రామకృష్ణా రెడ్డి ఈ నెల 8న ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
దాంతోపాటు ఆడియో టేపుల్లో స్వరం చంద్రబాబుదేనని నిర్థారించిన ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (ఎఫ్ఎస్ఎల్) నివేదికను కూడా అందించారు. ఈ నేపథ్యంలో పిటిషన్ను ఏసీబీ డీజీకి పంపుతున్నట్టు పేర్కొంటూ దీనిపై 29వ తేదీలో లోపు విచారణ పూర్తి చేసి, నివేదికను అందజేయాలని ఏసీబీ కోర్టు ఆదేశించింది.