సంగారెడ్డి ఎంపీవో అరెస్ట్: ఏసీబీ సోదాలు, రూ. 20 కోట్లకుపైగానే అక్రమాస్తుల గుర్తింపు
హైదరాబాద్: సంగారెడ్డి మండల పంచాయతీ అధికారి(ఎంపీవో) సురేందర్ రెడ్డిని అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులు అరెస్ట్ చేశారు. ఆదాయానికి మంచిన ఆస్తుల కేసు నమోదు చేసిన అధికారులు.. సురేందర్ రెడ్డి ఇంట్లో రూ. 2.31 కోట్ల విలువైన అక్రమాస్తులను ఏసీబీ గుర్తించింది. రూ. 43.79 లక్షల విలువ చేసే నాలుగు ఓపెన్ ఫ్లాట్ల దస్త్రాలు, రూ. 8.11 లక్షల విలువైన వ్యవసాయ భూముల పత్రాలు, 190 తులాల బంగారం, రూ. 4.22 లక్షల నగదును ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ ఈ కేసు వివరాలను వెల్లడిస్తూ.. ఎంపీవోకు ఆదాయానికి మించి ఆస్తులున్నట్లు తమకు సమాచారం వచ్చిందని తెలిపారు. హైదరాబాద్ అల్వాల్లోని ఎంపీవో నివాసంలో రూ. 20 కోట్ల నుంచి రూ. 30 కోట్లకుపైగానే ఉంటుందని ఏసీబీ డీఎస్పీ వెల్లడించారు.

ప్రస్తుతం సంగారెడ్డిలో పనిచేస్తున్న సురేందర్ రెడ్డి.. గతంలో శంషాబాద్ లో పనిచేసినప్పుడు భారీగా ఆస్తులు కూడబెట్టారని డీఎస్పీ తెలిపారు. ఎస్బీఐ బ్యాంక్ లాకర్లలో బంగారం, సురేందర్ రెడ్డి బావమరిది బినామీలుగా రెండు స్థిరాస్తులను గుర్తించినట్లు తెలిపారు. సురేందర్ రెడ్డిని బుధవారమే అరెస్ట్ చేశామని, వైద్య పరీక్షల అనంతరం కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు. ప్రస్తుతం సురేందర్ రెడ్డి సస్పెన్షన్లో ఉన్నారని చెప్పారు.