రేవంత్ జైలుకు వెళ్లక తప్పదా!: పక్కా ఆధారాలతో ఏసీబీ అనుబంధ చార్జిషీట్
పక్కా ఆధారాలతో చార్జీషీటు దాఖలు చేశామని ఏసీబీ అధికారులు స్పష్టం చేశారు. తమకు లభించిన ఆధారాలతో మరికొంతమంది పాత్రపై కూడా ఆరా తీస్తున్నట్లు తెలిపారు.
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రేవంత్ రెడ్డి చుట్టూ ఉచ్చు బిగిస్తున్నట్లే కనిపిస్తోంది. పూర్తి స్థాయి విచారణను పూర్తి చేసిన ఏసీబీ పక్కా ఆధారాలతో మరోసారి చార్జీషీటు దాఖలు చేసింది. దీంతో రేవంత్ జైలుకు వెళ్లక తప్పదా? అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
'కేసీఆర్ పతనం మొదలైంది.. నిరంకుశత్వంతో వెళ్తే పుట్టగతులుండవ్'
కాగా, కేసుకు సంబంధించి రేవంత్ సహా మరికొందరు నిందితుల పాత్రపై గతేడాది ఏసీబీ చార్జీషీటు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. కేసును బయటపెట్టిన స్టీఫెన్ సన్ వాంగ్మూలంతో పాటు ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి ఆయనతో ఫోన్ లో మాట్లాడినవారి వివరాలను ఆ చార్జీషీటులో పొందుపరిచారు.
స్టీఫెన్ సన్ తో పాటు, ఆయన కూతురు జెస్సికా, స్టీఫెన్ సన్ స్నేహితుడు, ఇంటి యజమాని మార్కం టేలర్ వాంగ్మూలాన్ని న్యాయమూర్తి వద్ద నుంచి ఏసీబీ సేకరించింది. వీటికి తోడు పలు కీలక ఆధారాలు, పలువురి స్టేట్మెంట్స్ ను చార్జీషీటుకు జతచేసి మొత్తం ఐదుగురిపై చార్జీషీటు దాఖలు చేశారు.
పూర్తి స్థాయి దర్యాప్తు పూర్తయిన తర్వాత మరో అనుబంధ చార్జిషీట్ ను దాఖలు చేస్తామని అప్పట్లోనే ఏసీబీ కోర్టుకు విన్నవించింది. ఈ మేరకు కేసులో రేవంత్రెడ్డి, సెబాస్టియన్, ఉదయ్సింహా, సండ్ర వెంకటవీరయ్య, మట్టయ్యల పాత్రపై ఏసీబీ పూర్తిస్థాయి విచారణ జరిపింది. వీడియో, ఆడియో టేపులతో పాటు పలువురు సాక్షుల వాంగ్మూలం, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ నివేదిక, పలు డాక్యుమెంట్లతో పక్కా ఆధారాలను ఏసీబీ సేకరించింది.
గతంలో పేర్కొన్న మాదిరిగానే వీటన్నింటిని అనుబంధ చార్జీషీటులో జతచేస్తూ ప్రత్యేక కోర్టులో ఏసీబీ సప్లిమెంటరీ చార్జీ షీటు దాఖలు చేసింది. పక్కా ఆధారాలతో చార్జీషీటు దాఖలు చేశామని ఏసీబీ అధికారులు స్పష్టం చేశారు. తమకు లభించిన ఆధారాలతో మరికొంతమంది పాత్రపై కూడా ఆరా తీస్తున్నట్లు తెలిపారు.
కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రేవంత్ రెడ్డి ప్రస్తుతం బెయిల్ పై బయటఉన్నారు. ఏసీబీ అనుబంధ చార్జీషీటు దాఖలు చేసిన నేపథ్యంలో మున్ముందు ఆయనకు మరింత గడ్డు పరిస్థితులు ఎదురువుతాయన్న వాదనలు వినిపిస్తున్నాయి.