ఈఎస్ఐ కుంభకోణం: మరో ఇద్దరి అరెస్ట్, దేవికారాణితో కుమ్మక్కు, షెల్ కంపెనీలతో కోట్లు క్లెయిమ్..
ఈఎస్ఐ కుంభకోణంలో అక్రమాలు బయటపడుతూనే ఉన్నాయి. నకిలీ బిల్లులతో మాజీ డైరెక్టర్ దేవికారాణి అండ్ కో.. రూ.కోట్లను నొక్కేసిన సంగతి తెలిసిందే. దేవికారాణి, పద్మావతి, సూపరింటెండెంట్ అందరూ జైలులో ఊచలు లెక్కబెడుతూనే ఉన్నారు. ఇటీవల మరో సూపరింటెండెంట్ వీరన్నను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. శనివారం మరో ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.
తవ్వినకొద్దీ..
ఈఎస్ఐ స్కాం విచారణలో కొత్త విషయాలు బయటపడుతున్నాయి. మాజీ డైరెక్టర్ దేవికారాణి, ఫార్మాసిస్ట్ నాగలక్ష్మీ, తేజా ఫార్మా కంపెనీల అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. రూ. కోట్ల చేతులు మారినట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. శనివారం మరో ఇద్దరిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు.
మరో ఇద్దరు..
సికింద్రాబాద్ విశాల్ ఎంటర్ ప్రైజెస్కు చెందిన పందిరి భూపాల్ రెడ్డి, వసుధ మార్కెటింగ్కు చెందిన నాగేందర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. వీరి దైవికారాణి, నాగలక్ష్మీ, తేజ ఫార్మా కంపెనీలతో కుమ్మక్కయ్యారని గుర్తించారు. షెల్ కంపెనీలు ఏర్పాటు చేసి నకిలీ బిల్లులను ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నుంచి క్లెయిమ్ చేసుకున్నారని అధికారులు పేర్కొన్నారు. దీంతో రూ.కోట్ల ప్రజాధనాన్ని తిన్నారని అర్థమవుతోంది.
ఇలా వెలుగులోకి..
ఈఎస్ఐలో నకిలీ బిల్లులతో మాజీ డైరెక్టర్ దేవికారాణి, జాయింట్ డైరెక్టర్ పద్మ రూ. కోట్ల కుంభకోణం వెలుగుచూసింది. కేసు నమోదు చేసిన ఏసీబీ దేవికారాణి, పద్మ సహా 16 మందిని అదుపులోకి తీసుకున్నారు. దీంతోపాటు హెచ్ఐవీ మెడికల్ కిట్ల పేరుతో కోటి 76 లక్షల స్కాం జరిగిందని అవినీతి నిరోధక శాఖ అధికారులు గుర్తించారు.
రూ.60 కోట్లు
మెడికల్ కిట్ల పేరుతో మాజీ డైరెక్టర్ దేవికారాణి, జేడీ పద్మ సిబ్బంది స్కాం చేశారని ఏసీబీ అధికారులు తెలిపారు. దేవికారాణి అండతోనే కుంభకోణం జరిగిందని వెల్లడించారు. 2017-18లో మెడికల్ కిట్ల కోసం రూ. 60 కోట్లు కేటాయించారు. ఇందులో మొత్తం 22 ఇండెంట్లు ఉన్నాయి. అయితే 2 ఇండెంట్లను ఏసీబీ అధికారులు పరిశీలించారు. ఇందులో స్కాం జరిగినట్టు గుర్తించారు.