ఈఎస్ఐ లీలలు: ఫార్మా కంపెనీల నుంచి డబ్బులు వసూల్, నగదు నగలుగా, మరొకరి అరెస్ట్
ఈఎస్ఐ కుంభకోణంలో తవ్వినకొద్దీ అక్రమాలు వెలుగుచూస్తున్నాయి. దేవికారాణి లీలలు ఒక్కొక్కటి బయటకొస్తున్నాయి. నకిలీ బిల్లులతో కోట్లు నొక్కిసిన సంగతి తెలిసిందే. డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్లు, సీనియర్ అసిస్టెంట్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాజాగా మరో సూపరింటెండెంట్ పోలీసులకు చిక్కాడు.
మరొకరి అరెస్ట్
ఈఎస్ఐ స్కాంలో మరో వికెట్ పడింది. మాజీ డైరెక్టర్ దేవికారాణి ఫార్మా కంపెనీల నుంచి ముడుపులు తీసుకున్నట్టు వార్తలొచ్చాయి. అయితే రూ. కోట్ల నగదుపై ప్రాథమిక వివరాలను ఏసీబీ అధికారులు సేకరించారు. కానీ అంతకన్నా ఎక్కువ స్కాం జరిగిందని తెలుస్తోంది. ఫార్మా కంపెనీల నుంచి దేవికారాణి భారీగా నగదు తీసుకున్నట్టు తెలుస్తోంది.
నగదు నగలుగా..
దేవికారాణికి మరొకరు కూడా సాయం చేసినట్టు సమాచారం. ఐఎంఎస్ డైరెక్టరేట్ సూపరింటెండెంట్ వీరన్న హెల్ప్ చేశాడని తెలుస్తోంది. ఫార్మా కంపెనీల నుంచి భారీగా ముడుపులు తీసుకున్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. అయితే నగదును బంగారం రూపంలో మార్చారని అధికారులు తెలిపారు. బంగారు ఆభరణాలు కొనుగోలు చేసి దేవికారాణికి అప్పగించినట్టు ఏసీబీ అధికారులు చెప్తున్నారు. ఈ ఆరోపణలపై వీరన్నను కూడా అదుపులోకి తీసుకున్నారు. బంగారు ఆభరణాల కొనుగోలు గురించి ప్రశ్నిస్తున్నారు.
కోట్లు నొక్కేశారు
ఈఎస్ఐలో నకిలీ బిల్లులతో మాజీ డైరెక్టర్ దేవికారాణి, జాయింట్ డైరెక్టర్ పద్మ రూ. కోట్ల కుంభకోణం వెలుగుచూసింది. కేసు నమోదు చేసిన ఏసీబీ దేవికారాణి, పద్మ సహా 16 మందిని అదుపులోకి తీసుకున్నారు. దీంతోపాటు హెచ్ఐవీ మెడికల్ కిట్ల పేరుతో కోటి 76 లక్షల స్కాం జరిగిందని అవినీతి నిరోధక శాఖ అధికారులు గుర్తించారు.
అండ దండ
మెడికల్ కిట్ల పేరుతో మాజీ డైరెక్టర్ దేవికారాణి, జేడీ పద్మ సిబ్బంది స్కాం చేశారని ఏసీబీ అధికారులు తెలిపారు. దేవికారాణి అండతోనే కుంభకోణం జరిగిందని వెల్లడించారు. 2017-18లో మెడికల్ కిట్ల కోసం రూ. 60 కోట్లు కేటాయించారు. ఇందులో మొత్తం 22 ఇండెంట్లు ఉన్నాయి. అయితే 2 ఇండెంట్లను ఏసీబీ అధికారులు పరిశీలించారు. ఇందులో స్కాం జరిగినట్టు గుర్తించారు.