లంచావతారం ..ఏసీబీ వలలో వీఆర్వో .. ఏం జరిగినా మారరేం !!
తెలంగాణ సర్కార్ రెవెన్యూ శాఖ ప్రక్షాళనకు నడుం బిగించినా, కొత్త రెవెన్యూ చట్టం తీసుకువస్తున్నా , మరో పక్క రెవెన్యూ శాఖలో జరుగుతున్న అవినీతి పలు ఘటనలతో వెలుగులోకి వస్తున్నా లంచావతారాలు మాత్రం మారటం లేదు . సాక్షాత్తు సీఎం కేసీఆర్ రెవెన్యూలో అవినీతిపై అసహనం వ్యక్తం చేసినా బరాబర్ లంచాలు తీసుకునే తీరుతామని నిర్ణయం తీసుకున్నారు కొందరు అక్రమార్కులు. ఏం జరిగినా మారేది లేదు అన్నట్టు వ్యవహరిస్తున్నారు.
లంచం అడిగారని బాధితుడి ఆరోపణ .. చెప్పుతో కొట్టిన ప్రభుత్వాధికారిణి
లంచాలు మానుకోని రెవెన్యూ ఉద్యోగులు
ఒక పక్క ఇప్పడు జరుగుతున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో నూతన రెవెన్యూ చట్టం బిల్లు ప్రవేశపెట్టాలని భావిస్తున్న సర్కార్ ఆ దిశగా అడుగులు వేస్తుంటే లంచాలకు అలవాటు పడిన ఉద్యోగులు మాత్రం పైసలు ఇస్తేనే పని చేస్తామని చెప్తున్నారు. చేతులు తడపకుంటే ఫైల్ కదలదు అని తేల్చి చెప్తున్నారు. దాడులు చేసినా , ఫిర్యాదులు చేసినా మేం లెక్క చెయ్యం అని తేల్చి చెప్పేస్తున్నారు. పనికో రేటు ఫిక్స్ చేసి రెవెన్యూ శాఖలో అవినీతి బాగోతం కొనసాగిస్తూనే ఉన్నారు.
మద్దూరు తహసీల్దార్ ఆఫీస్ లో ఏసీబీ వలలో వీఆర్వో
ఇక అలాంటి ఒక లంచావతారాన్ని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. నారాయణ పేట జిల్లాలోని మద్దూరు తహసీల్దార్ కార్యాలయంపై అవినీతి నిరోదక శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. భూమికి సంబంధించిన విషయంలో పేరు మార్పు కోసం రైతు దరఖాస్తు చేసుకుంటే పేరు మార్చటానికి సదరు వీఆర్వో లంచం డిమాండ్ చేశారు . చెన్నారం గ్రామ వీఆర్వో అనంత పద్మనాభం రూ.10 వేలు లంచం డిమాండ్ చెయ్యగా సదరు రైతు బతిమాలడంతో రూ.8 వేలు తీసుకోవడానికి అంగీకరించాడు.
లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు
ఇక బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించటంతో రైతు ఫిర్యాదు మేరకు ఈ రోజు పద్మనాభం తహసీల్దారు కార్యాలయంలో రైతు వద్ద నుండి లంచం తీసుకుంటుండగా మాటు వేసిన ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసిన అధికారులు ఇందులో ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉందన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మొత్తానికి ఇలా లంచాలకు అలవాటు పడిన అధికారులు క్రింద స్థాయి నుండి ఉన్నత స్థాయి వరకు ఉన్నారు. ఇలా ఎవరైనా లంచం కోసం వేధిస్తే ఏసీబీ అధికారులు తమకు ఫిర్యాదు చెయ్యాలని విజ్ఞప్తి చేస్తున్నారు.