కీసర ఎమ్మార్వో బినామీ బ్యాంకు లాకర్లు తెరిచిన ఏసీబీ... ఆస్తుల పత్రాలు స్వాధీనం...
ఇటీవల ఆత్మహత్య చేసుకున్న కీసర మాజీ తహశీల్దార్ నాగరాజు బినామీలకు చెందిన రెండు బ్యాంకు లాకర్లను ఏసీబీ అధికారులు తెరిచారు. గురువారం(అక్టోబర్ 22) అల్వాల్,మేడ్చల్ ఐసీఐసీఐ శాఖల్లో నాగరాజు బినామీల లాకర్లను తెరిచి.. అందులో ఉన్న 1250గ్రా. బంగారం,7.2కిలోల వెండి,రెండు ప్రాపర్టీలకు సంబంధించిన డాక్యుమెంట్స్ను స్వాధీనం చేసుకున్నారు.
అల్వాల్ ఐసీఐసీఐ శాఖలోని లాకర్ నందగోపాల్ అనే వ్యక్తి పేరు మీద ఉన్నట్లు ఏసీబీ అధికారులు నిర్దారించారు. అలాగే మేడ్చల్ ఐసీఐసీఐ శాఖలోని లాకర్ మహేందర్ అనే వ్యక్తి పేరు మీద ఉన్నట్లు నిర్దారించారు. వీరిద్దరు నాగరాజు స్నేహితులుగా గుర్తించారు. వీరిలో మహేందర్ అనే వ్యక్తి ఐసీఐసీఐ బ్యాంకులోనే పనిచేస్తున్నట్లు గుర్తించారు. తమ మధ్య ఉన్న స్నేహంతో నాగరాజు వారిని ఒప్పించినట్లు తేల్చారు. నాగరాజు భార్య స్వప్న ఈ రెండు లాకర్లను మెయింటైన్ చేస్తున్నట్లు నిర్దారించారు. లాకర్లో దొరికిన ఆస్తుల పత్రాలపై ప్రస్తుతం అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు. ఆ ఆస్తులు ఎక్కడున్నాయి.. నాగరాజుకు ఎలా వచ్చాయి... అన్న కోణంలో దర్యాప్తు సాగిస్తున్నారు.
కాగా,ఈ ఏడాది అగస్టు నెలలో హైదరాబాద్లోని ఏఎస్ రావు నగర్లో లంచం తీసుకుంటూ ఎమ్మార్వో నాగరాజు రెడ్ హ్యాండెడ్గా పోలీసులకు దొరికిపోయిన సంగతి తెలిసిందే. కీసర పరిధిలోకి వచ్చే రాంపల్లిలో 28 ఎకరాల వివాదాస్పద భూమికి నిబంధనలకు విరుద్దంగా క్లియరెన్స్ ఇచ్చేందుకు ఎమ్మార్వో రియల్ ఎస్టేట్ వ్యాపారులు అంజిరెడ్డి,శ్రీనాథ్ల నుంచి రూ2కోట్లు డిమాండ్ చేశారు. ఇందులో భాగంగా మొదట రూ1.10కోట్లు లంచాన్ని అడ్వాన్స్గా తీసుకుంటూ పోలీసులకు చిక్కారు. ఆ తర్వాత రిమాండ్ ఖైదీగా చంచల్ గూడ జైల్లో ఉన్న నాగరాజు... అక్టోబర్ 14న జైల్లోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.