అక్రమాలు: నిమ్స్ మాజీ డైరెక్టర్ ధర్మరక్షక్ ఇంట్లో ఎసిబి సోదాలు
హైదరాబాద్: నిమ్స్ (నిజామ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) మాజీ డైరెక్టర్ డాక్టర్ ధర్మరక్షక్ నివాసంలో అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) అధికారులు గురువారం ఉదయం సోదాలు నిర్వహించారు. ఎసిబి డిఎస్పీ రవికుమార్ ఆధ్వర్యంలో 15 మందితో కూడిన అధికారుల బృందం సోదాలు నిర్వహించింది.
ఈ దాడుల్లో పలు రకాల దస్త్రాలు, ఇతర ఆధారాలను తనిఖీ చేశారు. కొంత మొత్తంలో నగదు లభ్యమైనట్లుగా తెలుస్తోంది. 2013 - 14లో నిమ్స్ సంచాలకులుగా పని చేసిన ధర్మరక్షక్ ఏకపక్షంగా వ్యవహరించాలన్న ఆరోపణలు ఉన్నాయి.
టెండర్ల సమయంలో ఇష్టానుసారంగా వ్యవహరించాడంతో పాటు వైద్య పరికరాల కొనుగోలులో అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారన్న విమర్శలు వచ్చాయి. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం వల్ల రూ.3 కోట్ల వరకు అవినీతి జరిగినట్లు ఎసిబికి భారీగా ఫిర్యాదులు అందాయి.
అంతేకాకుండా, ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణల పైన కూడా ఈ దాడులు నిర్వహించారు. అవినీతి నిరోధక చట్టం కింద డాక్టర్ ధర్మరక్షక్ పైన కేసు నమోదు చేసినట్లు ఏసిబి అధికారులు తెలిపారు. కాగా, ధర్మరక్షక్తో పాటు నాడి అడిషనల్ మెడికల్ సూపరిండెంట్ ముకుంద్ రెడ్డి, పైనాన్షియల్ కన్సల్టెంట్ శ్రీధర్, ఇద్దరు సప్లయర్స్.. మొత్తం అయిదుగురి ఇళ్లలో సోదాలు నిర్వహించారు.
దర్యాఫ్తుకు సహకరిస్తా: ధర్మరక్షక్
ఎసిబి అధికారుల దర్యాఫ్తుకు తాను సహకరిస్తానని డాక్టర్ ధర్మరక్షక్ చెప్పారు. అప్పటి ప్రభుత్వం ఒత్తిడి మేరకే పరికరాలు కొనుగోలు చేశామన్నారు. తన పైన ఆరోపణలు అవాస్తవం అన్నారు. కమిటీ నిర్ణయమ తీసుకున్నాకే పరికరాలు కొనుగోలు చేశామన్నారు.