ల్యాండ్స్కాం: సబ్రిజిస్ట్రార్ ఇళ్లపై ఏసీబీ దాడులు, అక్రమాస్తులు 200కోట్లపైనే!
మియాపూర్ భూకుంభకోణంలో నిందితుడైన సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాసరావు ఇంటిపై ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. శ్రీనివాసరావుకు చెందిన 10 ఆస్తులపై ఏకకాలంలో ఏసీబీ అధికారులు దాడులు చేశారు.
హైదరాబాద్: వేల కోట్ల రూపాయల మియాపూర్ భూకుంభకోణంలో నిందితుడైన సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాసరావు ఇంటిపై మంగళవారం ఉదయం నుంచి ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. శ్రీనివాసరావుకు చెందిన 10 ఆస్తులపై ఏకకాలంలో ఏసీబీ అధికారులు దాడులు చేశారు.
ఆదాయానికి మించిన ఆస్తులున్నట్లు ఆరోపణలు రావడంతో ఏసీబీ అధికారులు ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. రూ. 200 కోట్ల వరకు శ్రీనివాసరావు ఆస్తులుంటాయని అంచనా వేస్తున్నారు. మియాపూర్ భూ కుంభకోణంలో సస్పెండైన శ్రీనివాసరావు ప్రస్తుతం జైలులో ఉన్నారు.
మియాపూర్లో రూ.10వేలకోట్ల భారీ భూకుంభకోణం, 'పెద్దలు' ఉన్నారా?
వేల కోట్ల భూకుంభకోణంలో శ్రీనివాసరావుదే కీలక పాత్ర అని తేలింది. అత్యంత విలువైన మియాపూర్లోని భూములను భారీ లంచానికి ఆశపడి ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టారనే ఆరోపణలపై శ్రీనివాసరావును పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ క్రమంలో బోయినపల్లి, కూకట్ పల్లి, తదితర ప్రాంతాల్లో శ్రీనివాసరావుకు చెందిన ఆస్తులపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. సోదాల్లో భారీగా నగలు, డబ్బు బయటపడినట్లు సమాచారం. తనిఖీలు పూర్తయిన తర్వాత ఏసీబీ అధికారులు వివరాలను మీడియాకు తెలిపే అవకాశం ఉంది.
కెసిఆర్కు చిక్కులు: భూస్కాంతో నమస్తే తెలంగాణ సిఈవోకు లింక్?
ప్రతీ బ్యాంకులో అకౌంట్: కోట్లలో లావాదేవీలు
హాసిని పవర్, నార్త్ స్టార్, జయశ్రీ ప్రాజెక్టుల నుంచి పది కోట్ల రూపాయల వరకు లావాదేవీలు జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించామని ఏసీబీ డీఎస్పీ సునీతారెడ్డి వెల్లడించారు. శ్రీనివాస రావు కుటుంబ సభ్యులందరి పేరిట బ్యాంకు ఖాతాలు ఉన్నాయని, అతని కుమారుడు కనిష్క పేరిట.. హాసిని పవర్ ప్రాజెక్టు ఉందన్నారు.
తండ్రీ - కొడుకుల పేరిట 17 క్రెడిట్ కార్డులను గుర్తించామని చెప్పారు. హాసిని, నార్త్ స్టార్ ప్రాజెక్టుల్లో 2 కోట్ల రూపాయల చొప్పున పెట్టుబడులు ఉన్నాయని వివరించారు. పూర్తి విచారణ తర్వాతే అన్ని అంశాలు బయటికొస్తాయని చెప్పారు. కాగా, అతని ఆస్తులు మొత్తం రూ.200కోట్లకు పైమాటేనని అంచనా వేస్తున్నారు.
సీసీఎస్ కస్టడీకి భూ కబ్జా నిందితులు
భూ కబ్జా కేసులో అరెస్టై చంచల్గూడ జైల్లో ఉన్న ముగ్గురు నిందితులు ఏపీ ఎమ్మెల్సీ దీపక్రెడ్డి, న్యాయవాది శైలేష్ సక్సేనా, శ్రీనివాస్లను సీసీఎస్ పోలీసులు సోమవారం రాత్రి 7 గంటలకు తమ కస్టడీకి తరలించారు. అంతకు ముందు సోమవారం ఉదయం సీసీఎస్ పోలీసులు దీపక్రెడ్డిని పిటీ వారంట్పై కోర్టులో హాజరు పరిచి జైలుకు తరలించారు. న్యాయస్థానం ఉత్తర్వుల ప్రకారం ముగ్గురు నిందితులను మూడు రోజుల సీసీఎస్ కస్టడీకి ఇచ్చామని జైలు అధికారి సైదయ్య తెలిపారు.