వరంగల్ జైలుకు పరారైన నిందితుడు సైనిక్ సింగ్
వరంగల్: ఆర్మీలో పనిచేస్తూ ఎకే47 అమ్ముకున్న కేసులో శిక్ష అనుభవిస్తూ వరంగల్ సెంట్రల్ జైలు నుంచి నవంబర్ 13న తప్పించుకుని పారిపోయిన సైనిక్ సింగ్ యథాస్థానానికి చేరుకున్నాడు. మంగళవారం రాత్రి సుమారు 12 గంటలకు సెంట్రల్ జైలులో అతడ్ని రిమాండ్ చేశారు.
కాగా, మట్టెవాడ పోలీసులు సైనిక్ సింగ్ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం గాజువాక పోలీసుస్టేషన్ నుంచి జిల్లాకు మంగళవారం తెల్లవారుజామున తీసుకొచ్చారు. విచారణ జరిపిన అనంతరం వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి మంగళవారం రాత్రి వరంగల్ సెంట్రల్ జైలుకు తరలించినట్లు జిల్లా జైలు అధికారులు తెలిపారు.
ఉరి వేసుకొని వ్యక్తి ఆత్మహత్య
వరంగల్ నగరంలోని ఖిలావరంగల్ మధ్యకోటలో మంగళవారం ఓ వ్యక్తి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మిల్స్కాలనీ ఎస్సై రవీందర్ తెలిపిన వివరాల ప్రకారం... ఖిలావరంగల్ మధ్యకోట ప్రాంతానికి చెందిన రాఘవేంద్రరాజు (43) ఇదే ప్రాంతంలో పిండిగిర్ని నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. కాగా, రోజు మాదిరగానే పిండిగిర్నికి వచ్చిన రాఘవేంద్రరాజు షాపు పక్కనే ఉన్న మరో గదిలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
కాగా, షాపు ముందు నివాసం ఉంటున్న వ్యక్తి గమనించి అతని కుటుంబ సభ్యులకు తెలియజేశాడు. కాగా, ఆత్మహత్య సమాచారం తెలుసుకున్న మిల్స్కాలనీ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేప్పారు. మృతుడు రాఘవేంద్రరాఉ భార్య సుకన్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
జైలు పర్యవేక్షణాధికారిగా బాధ్యతలు చేపట్టిన సంపత్
వరంగల్ కేంద్రకారాగారం పర్యవేక్షణాధికారిగా పనిచేస్తున్న న్యూటన్ హైదరాబాద్ జైళ్లశాఖ ప్రధాన కార్యాలయంకు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో మహబూబ్నగర్ జిల్లా కారాగారం ఉప పర్యవేక్షణాధికారిగా ఉన్న సంపత్ను వరంగల్ కేంద్ర కారాగారం ఇన్ఛార్జి పర్యవేక్షణాధికారిగా బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు బుధవారం ఉదయం సంపత్ న్యూటన్ నుంచి బాధ్యతలు స్వీకరించారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జైలు భద్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తానన్నారు. జైలులో కాపలా విభాగాలు (సెంట్రీ)ల సంఖ్య పెంచేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. సీసీ కెమెరాలను వినియోగంలోకి తీసుకొచ్చి ఖైదీల కదలికలపై నిరంతర పర్యవేక్షణ పెడతామన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరు పనిచేసినా వేటు వేస్తామని హెచ్చరించారు.