ఏం జరిగి ఉంటుంది?: సుధాకర్ రెడ్డిపై యాసిడ్ దాడి.. భార్యను నిర్బంధించి..
నాగర్కర్నూలు: నాగర్కర్నూలు జిల్లా కేంద్రంలో సుధాకర్రెడ్డి అనే క్రషర్ వ్యాపారిపై యాసిడ్ దాడి జరగడం సంచలనం రేపుతోంది. దుండగులు ఇంట్లోకి ప్రవేశించి మరీ.. ఆయన భార్యను నిర్బంధించి సుధాకర్ రెడ్డిపై యాసిడ్ దాడికి పాల్పడ్డారు.
ఇంత జరిగినా.. ఆ చుట్టుపక్కల గానీ, పక్కింటివాళ్లకు గానీ పోలీసులు వెళ్లేదాకా విషయం తెలియకపోవడం గమనార్హం. ప్రస్తుతం బాధితుడు హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు.
సుధాకర్ రెడ్డి నేపథ్యం
నాగర్కర్నూలు జిల్లా కేంద్రంలోని హౌజింగ్ బోర్డు కాలనీలో సుధాకర్రెడ్డి (30), స్వాతి దంపతులు నివాసముంటున్నారు. తెలకపల్లి మండలం బండపల్లికి చెందిన సుధాకర్ రెడ్డికి స్వాతితో ఏడేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి పొన్ను(7) కుమారుడు, మిన్ను(4) అనే కుమార్తె ఉన్నారు. గతంలో హైదరాబాద్లోని గుబ్బ స్టోరేజీలో సుధాకర్రెడ్డి మేనేజర్గా పని చేశాడు. కొన్నాళ్లుగా గట్టురాయిపాకుల వద్ద క్రషర్ను లీజుకు తీసుకుని వ్యాపారం చేస్తున్నాడు.
ఘటనపై అనుమానాలు:
మంగళవారం రోజు సుధాకర్ రెడ్డిపై ఇంటి వద్దే దాడి జరిగినట్టు తెలుస్తోంది. సుధాకర్రెడ్డి నివసిస్తున్న అద్దె ఇంట్లో యజమానులతో పాటూ దాదాపు నాలుగు కుటుంబాలు అద్దెకు ఉంటున్నాయి. అలాంటప్పుడు వాళ్లకు కనీసం అలికిడి కూడా వినిపించలేదా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. నాగర్ కర్నూల్ ప్రధాన రహదారికి అతి సమీపంలో ఉన్నా.. ఈ దాడి గురించి ఒకరోజు ఆలస్యంగా వెలుగులోకి రావడంపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఎవరితోను విభేదాలు లేవు:
మంగళవారం సుధాకర్ రెడ్డి ఇంటికి పోలీసులు వచ్చేంతవరకు ఈ ఘటన గురించి చుట్టుపక్కల వారికి తెలియలేదు. బాధితుడు సుధాకర్రెడ్డికి రాజకీయంగా గానీ, వ్యాపార పరంగా గానీ ఎవరితోనూ విభేదాలు లేవని భార్య స్వాతితో పాటు కుటుంబ సభ్యులంతా చెప్తున్నారు.
పోలీసుల ఆరా:
సుధాకర్ రెడ్డి ఇంట్లో డబ్బు గానీ, నగలు గానీ చోరీ అవలేదు. ఎవరితోను ఎలాంటి విభేదాలు లేనప్పుడు సుధాకర్ రెడ్డిపై ఎందుకు దాడి జరిగిందన్నది అంతుచిక్కడం లేదు. రాత్రి పొద్దుపోయే వరకు పోలీసులు సమాచారాన్ని రాబట్టే ప్రయత్నం చేశారు. నిందితులను పట్టుకుంటేనే ఈ కేసు మిస్టరీ వెల్లడయ్యే అవకాశాలున్నాయి.