హైదరాబాద్ లో దారుణం: ప్రియురాలిపై ప్రేమోన్మాది యాసిడ్ దాడి
హైదరాబాద్: తనను పట్టించుకోవడం లేదన్న కారణంతో ఓ ప్రేమోన్మాది ప్రియురాలిపై యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. హైదరాబాద్ లోని హయత్ నగర్ లో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
వివరాల్లోకి వెళ్తే.. హయత్నగర్ ప్రాంతానికి చెందిన శంకర్, ఝాన్సీలు రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.ఝాన్సీ స్థానికంగా ఓ పెట్రోలు బంకులో పనిచేస్తోంది. ఇదే పెట్రోలు బంకులో కొద్దిరోజుల క్రితం రమ్య అనే మరో అమ్మాయి చేరింది.
రమ్య అక్కడ చేరినప్పటినుంచి ఝాన్సీ తనతో సరిగా మాట్లాడటం లేదని శంకర్ అనుమానం పెంచుకున్నాడు. తన గురించి ఝాన్సీకి రమ్య లేనిపోనివి చెప్పి ఉంటుందని అనుమానించాడు. అదే కోపంతో నిన్న రాత్రి వారిపై యాసిడ్ దాడికి పాల్పడ్డాడు.
పెట్రోల్ బంకులో పని ముగించుకుని ఝాన్సీ, రమ్య ఇద్దరూ ఇంటికి వెళ్తున్న క్రమంలో.. అటుగా వచ్చిన శంకర్ వారిపై యాసిడ్ పోసి పరారయ్యాడు. అయితే యాసిడ్ గాఢత తక్కువగా ఉండటంతో ప్రాణపాయమేమి జరగలేదు. ప్రస్తుతం వారిద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.