హ్యాపీ ఎండింగ్: కోఠి ఆస్పత్రిలో కిడ్నాపై తల్లి ఒడికి చేరిన ఆ పాపకు ఏసీపీ ‘చేతన’ పేరు
హైదరాబాద్: నగరంలోని కోఠి ప్రసూతి ఆస్పత్రిలో అపహరణకు గురై ఒక రోజు తర్వాత క్షేమంగా తన తల్లి వద్దకు చేరిన ఆ పాపకు సుల్తాన్బజార్ ఏసీపీ 'చేతన' పేరునే ఆ పాపకు పెట్టడం విశేషం. ఆ పాపను తిరిగి తల్లి వద్దకు చేర్చడంలో ఏసీపీ చేతన కీలకంగా వ్యవహరించిన విషయం తెలిసిందే.
స్వయంగా బీదర్ వెళ్లిన ఏసీపీ
సోమవారం పాప అపహరణకు గురైనట్లు ఆస్పత్రి సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదు మేరకు సుల్తాన్ బజార్ ఏసీపీ డా. చేతన నేతృత్వంలో బృందాలు తీవ్రంగా గాలించాయి. సీసీ కెమెరాల ద్వారా ఆమె ఎంజీబీఎస్ బస్ స్టేషన్లో బీదర్ వెళ్లే బస్సు ఎక్కిందని గుర్తించిన పోలీసులు అక్కడికి వెళ్లారు. ఏసీపీ చేతన స్వయంగా బీదర్కు వెళ్లి పరిస్థితిని సమన్వయం చేసి చివరకు ఆ శిశువును సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు.
వెంబడించిన పోలీసులు: బీదర్ ఆస్పత్రిలో.. కోఠి ఆస్పత్రిలో కిడ్నాపైన పాప
ఆ పాపకు ఏసీపీ చేతన పేరు
తమ బిడ్డను సురక్షితంగా అప్పగించిన పోలీసులకు ఆ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు చెప్పారు. అంతేగాక, ఆ శిశువుకు ఏసీపీ చేతన పేరే పెట్టి తమ కృతజ్ఞతను చాటుకున్నారు. ఈ విషయాన్ని నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ వెల్లడించారు. ఆ పాప బాగా చదువుకుని చేతనలాగే తయారు కావాలని ఆకాంక్షించారు.
సీపీ అభినందనలు
బుధవారం సీపీ అంజనీకుమార్.. కోఠి ప్రసూతి ఆస్పత్రిని సందర్శించి అక్కడి రక్షణ చర్యల్ని పరిశీలించారు. సమష్టి కృషితో శిశువును తల్లి చెంతకు చేర్చిన పోలీసు సిబ్బందిని అభినందించారు. కోఠి ఆస్పత్రిలో చోటుచేసుకున్న ఇలాంటి శిశువు అపహరణ ఘటనలు పునరావృతం కాకుండా అన్ని ఆస్పత్రుల్లోనూ చర్యలు తీసుకుంటామని సీపీ తెలిపారు. ఈ ఘటనపై మీడియా నుంచి కూడా మంచి సహకారం అందిందని చెప్పారు.
మీడియా సహకారంతోనే..
తెలుగు మీడియాతోపాటు బీదర్(కర్ణాటక) మీడియాలోనూ బాగా కవర్చేశారని అభినందించారు. దీంతో నిందితురాలిలో భయం ఏర్పడిందని, అందువల్లే బీదర్ ఆస్పత్రి వద్ద పాపను వదిలి వెళ్లిందని సీపీ అంజనీకుమార్ తెలిపారు. కాగా, పాప కిడ్నాప్ ఘటనకు సంబంధించి కమిటీ వేశామని, త్వరలోనే నివేదిక వస్తుందని కోఠి ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆ పాపకు కామెర్లు వచ్చాయని, నీలోఫర్ ఆస్పత్రికి తరలించి మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు.