భారీ భద్రత నడుమ హైదరాబాద్కు వరవరరావు: 6 వరకు గృహ నిర్బంధం
హైదరాబాద్: సుప్రీం కోర్టు ఆదేశాలతో మహారాష్ట్ర పోలీసులు విరసం నేత రవరరావును పుణె నుంచి హైదరాబాద్కు తరలించారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి భారీ భద్రత నడుమ హైదరాబాద్ గాంధీనగర్లోని ఆయన నివాసంలో వదిలిపెట్టి వెళ్లారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గురువారం నుంచి సెప్టెంబర్ 6 వరకు గృహనిర్బంధంలో ఉంచనున్నారు.
ప్రధాని హత్యకు కుట్ర పన్నారనే ఆరోపణలతో పాటు మావోయిస్టులతో సంబంధాలున్నాయనే అనుమానంతో ఏకకాలంలో ప్రముఖ పౌర హక్కుల నేతలు, మావోయిస్టు సానుభూతిపరులను అరెస్ట్ చేసిన విషయం తెల్సిందే. అందులో భాగంగా విరసం నేత వరవర రావుతో పాటు మరో నలుగురు పౌరహక్కుల నేతలను హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. దీనిపై కోర్టుకు వెళ్లడంతో హౌస్ అరెస్ట్ చేసి మాత్రమే విచారణ జరపాలని సుప్రీంకోర్టు, పోలీసులను ఆదేశించింది.
వరవరరావును ప్రస్తుతం పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు. అలాగే పుణెకు చెందిన నలుగురు పోలీసులు వరవరరావు ఇంటి వద్ద ప్రత్యేకంగా కాపలాగా ఉన్నారు. అలాగే తెలంగాణ పోలీసులు కూడా అక్కడ భారీగా మోహరించారు. పరిసర ప్రాంతాల్లోకి ఎవరినీ అనుమతించటం లేదు.
ఆందోళన వద్దని చెప్పిన హైకోర్టు
విప్లవ రచయితల సంఘం (విరసం) నేత పెండ్యాల వరవరరావును పోలీసులు బహిరంగంగానే అరెస్ట్ చేసినందున ఆయన ప్రాణాలకు హాని ఉంటుందనే అందోళన అవసరం లేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఇది ఒక వైపు జాతి ప్రయోజనాలు-మరోవైపు వ్యక్తి స్వేచ్ఛకు సంబంధించిన సున్నిత అంశమని హైకోర్టు అభిప్రాయపడింది. చట్ట నిబంధనలకు అనుగుణంగానే వరవరరావును అరెస్ట్ చేశారో లేదో అనే అంశంపైనే విచారణ జరపాల్సివుందని బుధవారం ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి, జస్టిస్ టి.అమర్నాథ్గౌడ్ల ధర్మాసనం పేర్కొంది.
మహారాష్ట్ర పోలీసులు తన భర్త వరవరరావును అన్యాయంగా అదుపులోకి తీసుకున్నారని, ఆయనకు ప్రాణహాని ఉందని, వెంటనే ఆయనను కోర్టులో హాజరుపర్చేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ పి.హేమలత అత్యవసర వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. దీనిని బుధవారం ధర్మాసనం విచారిస్తూ.. వరవరరావు అరెస్ట్ నిబంధనలకు వ్యతిరేకంగా ఉంటే వాటిని రద్దు చేస్తామని స్పష్టం చేసింది. వరవరరావును అరెస్ట్ చేసి మహారాష్ట్ర తీసుకువెళ్లేప్పుడు ఇచ్చిన ట్రాన్సిస్ట్ ఆర్డర్ కాపీని తెలుగులో అనువదించి హేమలతకు అందజేయాలని తెలంగాణ పోలీసులను ధర్మాసనం ఆదేశించింది.
ఈ అరెస్ట్పై కౌంటర్ వేయాలని తెలంగాణ రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, మహారాష్ట్ర డీజీపీలను హైకోర్టు ఆదేశించింది. ట్రాన్సిస్ట్ ఆర్డర్ మరాఠీ బాషలో హేమలతకు అందజేశారని పిటిషనర్ తరఫు న్యాయవాది సురేష్కుమార్ చెప్పడంతో ధర్మాసనం పైవిధంగా ఉత్తర్వులు ఇచ్చింది. వరవరరావును పోలీసులు అదుపులోకి తీసుకోడానికి కారణం చెప్పలేదనీ, మహారాష్ట్రలోని భీమా-కోరేగావ్లో గత జనవరిలో జరిగిన అల్లర్లకు వరవరరావుకు సంబంధం లేదని, ఆ కేసులో ఆయన పేరు కూడా లేదని సురేష్ ధర్మాసనానికి చెప్పారు. కాగా, తదుపరి విచారణ వచ్చే వారానికి వాయిదా పడింది.
అరెస్టులపై రోమిలా థాపర్ పిటిషన్
భిన్నాభిప్రాయాలను వెల్లడించే గొంతుకలను నొక్కేయడానికే ఐదుగురు పౌరహక్కుల నేతలను పోలీసులు అరెస్టు చేశారని ప్రముఖ చరిత్రకారిణి రోమిలా థాపర్, మరో నలుగురు మేధావులు ఆరోపించారు. పుణె పోలీసుల చర్య.. పౌరుల స్వేచ్ఛపై పెద్ద ఎత్తున చేసిన దాడి అని సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్లో అభివర్ణించారు. కోరెగావ్-భీమా హింసలో ఎఫ్ఐర్లు నమోదయిన హిందూ అతివాద కార్యకర్తలపై మాత్రం ఎటువంటి చర్యా తీసుకోలేదని ఆరోపించారు. రాజకీయ కుట్రలో భాగంగానే తనను అరెస్టు చేసినట్లు పౌరహక్కులనేత గౌతం నవలఖ ఆరోపించారు.