చనిపోతే దావూద్తో కూడా లింకు పెడతాడు: నట్టి ఆరోపణలపై భగ్గుమన్న నిర్మాతలు
హైదరాబాద్: పోలీసుల ఎన్కౌంటర్లో హతమైన గ్యాంగ్ స్టర్ నయీంతో పలువురు టాలీవుడ్ నిర్మాతలకు సంబంధాలున్నాయంటూ నిర్మాత నట్టి కుమార్ చేసిన ఆరోపణలపై టాలీవుడ్ నిర్మాతల మండలి స్పందించింది. గురువారం నిర్మాత మండలికి సంబంధించి ప్రముఖ నిర్మాత బూరుగుపల్లి శివరామకృష్ణ మీడియాతో మాట్లాడారు.
నిర్మాతలపై నట్టికుమార్ చేసిన ఆరోపణలు కేవలం పబ్లిసిటీ ప్రయత్నమేనని ఆయన మండిపడ్డారు. నయీంతో టాలీవుడ్ నిర్మాతలకు లింకులున్నాయని ఆరోపిస్తున్న వ్యాఖ్యల్లో ఎలాంటి నిజంలేదని అన్నారు. నట్టికుమార్ పబ్లిసిటీ కోసమే పక్కవారిపై బురద చల్లుతున్నారని వ్యాఖ్యానించారు.
నట్టి కుమార్ పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. ఇక్కడ జరిగేది వేరు బయట మీడియా మందుకు వచ్చి చెప్పేది మరొకటని ఆయన వ్యాఖ్యానించారు. మీడియాకు చేస్తున్న విజ్ఞప్తి ఒక్కటేనని నిజం తెలుసుకుని వార్తలను ప్రసారం చేయాలని కోరారు.
నట్టికుమార్ చేసిన ఆరోపణల్లో ఒక్కదానికి కూడా ఆధారాల్లేవని మండిపడ్డారు. తప్పు ఎవరు చేశారో కౌన్సిల్లో ఉన్న సభ్యులందరికీ తెలుసుని ఆయన అన్నారు. గతంలో కౌన్సిల్లో జరిగిన అవకతవకలపై పోలీసు కేసులు నమోదు చేశామని చెప్పారు. నట్టి తప్పుడు ఆరోపణలు చేశారు కాబట్టి అతడికి షోకాజ్ నోటీసులు జారీ చేశామని పేర్కొన్నారు.
నయీం చనిపోయిన తర్వాత ఆరోపణలు చేస్తున్నాడని, నయీం బ్రతికున్ననాళ్లు నట్టి కుమార్ ఎందుకు నోరు విప్పలేదని నిర్మాతల మండలి ప్రశ్నించింది. నట్టికుమార్ ఆరోపణలపై టాలీవుడ్ నిర్మాతల మండలి మూకుమ్మడి దాడి చేసింది.
నట్టికుమార్ ఆరోపణలు బాధించాయి: నిర్మాత అశోక్ కుమార్
నట్టికుమార్ చేసిన వ్యక్తిగత ఆరోపణలు ఎంతగానో బాధించాయని ప్రముఖ నటుడు, నిర్మాత అశోక్ కుమార్ వ్యాఖ్యానించారు. నట్టికుమార్పై పరువు నష్టం దావా వేయనున్నట్లు ఆయన తెలిపారు. తాను ఏ ఆర్గనైజేషన్కు చెందినవాడిని కానని చెప్పిన ఆయన నేనెంటో మీడియా మిత్రులకు తెలుసని అన్నారు.
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎలక్షన్స్లో ఎప్పుడూ మేం గెలుస్తామని, అతను ఓడిపోతాడని దానిని దృష్టిలో పెట్టుకుని ఆరోపణలు చేస్తున్నాడని ధ్వజమెత్తారు. దాని కారణంగా ఇటీవల కారణంగా జరిగిన ఎలక్షన్స్కు కూడా దూరంగా ఉన్నానని తెలిపారు. తనకు ఫార్మాసూటికల్స్ కంపెనీ ఉందని, దాని వ్యాపారం చేసుకుంటున్నానని అన్నారు.
తనకు విశాఖలో భూములు లేవని, తన భార్య ఫోన్ చేసి నయీంతో మీకు సంబంధాలున్నాయని మీడియాలో వార్తలు వస్తున్నాయని బాధపడుతోందని ఆయన చెప్పారు. నట్టికుమార్ ఏమైనా పోలీస్ ఆఫీసరా లేక ఇన్వెస్టిగేషన్ ఆఫీసరా నేను బినామీగా ఉన్నానంటూ ఆరోపణలు చేస్తున్నాడని మండిపడ్డారు.
తనకు సంబంధించిన ఏమైనా ఆధారాలుంటే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కు ఇవ్వమనండి అంతేగానీ ఆధారాలు లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఏదైనా సంఘటన జరిగినప్పుడు మాట్లాడితే హైప్ వస్తుందని ఈ విధంగా మాట్లాడుతున్నాడని ధ్వజమెత్తారు.
అసలు నయీంతో ఎవరో తెలియదని, అతడితో మేం సంబంధాలు పెట్టుకుని భూదందాలు చేస్తున్నాడని ఆరోపిస్తున్నాడు. నట్టికుమార్ మాట్లాడిన వీడియో చూసిన తర్వాత ప్రతి దానికి సమాధానం చెబుతానని అన్నారు.
నట్టికుమార్ ఆరోపణలపై కొడాలి వెంకటేశ్వరరావు
సినీ పరిశ్రమపై నట్టి కుమార్ ఆరోపణలు చేయడం సరికాదని ప్రముఖ నిర్మాత కొడాలి వెంకటేశ్వరరావు హితవు పలికారు. నట్టికుమార్ ఆధారాల్లేకుండా మాట్లాడుతున్నాడని పలువురు నిర్మాతలు మండిపడ్డారు. నయీం మరణించాడు కనుక అతనిపై నట్టి కుమార్ ఆరోపణలు చేస్తున్నాడని, రేపు దావూద్ ఇబ్రహీం మరణించినా అతనితో సినీ పరిశ్రమకు లింకులున్నాయని ఆరోపిస్తాడని అన్నారు.
ఆరోపణలు చేయడానికి నోరుంటే సరిపోతుందని, సాక్ష్యాలు లేవని ఆయన చెప్పారు. నట్టి కుమార్ వెనుక కొంత మంది ఉన్నట్టు కనిపిస్తోదని, వారి ప్రోద్బలంతోనే ఆయన చిలకపలుకుల్లా కొన్ని మాటలు మాట్లాడారని ఆయన తెలిపారు. ఆయన ఆధారాలు సిట్ కు ఇస్తానంటున్నప్పుడు ఇస్తే తేలిపోతుందని ఆయన చెప్పారు.
ప్రెస్ కూడా రుజువులతో మాట్లాడితే బాగుంటుందని, అలా కాకుండా టాలీవుడ్ నిర్మాతలతో నయీంకు సంబంధాలున్నాయంటూ వార్తలు ప్రసారం చేయడం ఏమీ బాగాలేదని అన్నారు. గతంలో భాను విషయంలో కూడా నట్టి కుమార్ ఆరోపణలు చేశాడని, అవి నిజం కాదని తేలిపోయిందని ఆయన గుర్తుచేశారు. నిర్మాతల మండలిలో నిజంగా తప్పు చేసిన వారు ఉంటే వారికి మేమే నోటీసులిచ్చి తప్పిస్తామని అన్నారు.