చంద్రబాబుకు మూడ్ వస్తే ప్రపంచమంతా తిరుగుతారు: సుహాసిని తరఫున బాలకృష్ణ ప్రచారం
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ నేత, హిందూపురం శాసన సభ్యులు నందమూరి బాలకృష్ణ మంగళవారం హైదరాబాదులో రోడ్డు షో నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఉమ్మడి ఏపీలో ఐటీ గురించి తెలియని రోజుల్లో చంద్రబాబు ఐటీకి నిర్వచనం ఇచ్చారని చెప్పారు. చంద్రబాబు హయాంలో కట్టిన భవనాల్లో కూర్చొని ఇప్పుడు కేసీఆర్ ఆయననే విమర్శిస్తారా అని మండిపడ్డారు.
టీడీపీ ప్రభుత్వం అప్పుడు చేపట్టిన అభివృద్ధి పనులు ఇప్పుడు కళ్ల ముందు ఇంకా కనిపిస్తూనే ఉన్నాయని చెప్పారు. టీడీపీకి తెలంగాణలో పూర్వవైభవం వస్తుందని చెప్పారు. టీడీపీ ఓ కులానికి, మతానికి చెందిన పార్టీ కాదని చెప్పారు. హైదరాబాద్ నడిబొడ్డున ప్రజల మద్దతుతో పుట్టిన పార్టీ అన్నారు. ఆయన కూకట్పల్లి, ఓల్డ్ బోయినపల్లిలలో నందమూరి సుహాసిని తరఫున ప్రచారం నిర్వహించారు.
ఎదుర్కోలేక నన్ను, నా భర్తను అంటావా: మధుయాష్కీకి కవిత లీగల్ నోటీసులు
తెలంగాణలో అధికారంలోకి రాబోతుంది
తెలుగువారికి కష్టం వస్తే బెంగళూరు, ఉత్తరాఖండ్ వరకు వెళ్లి పోరాడిన వ్యక్తి చంద్రబాబు, టీడీపీ అని బాలకృష్ణ తెలిపారు. తెలుగు ప్రజలు ఎక్కడున్నా టీడీపీ అక్కడ ఉంటుందని, వారి క్షేమం చూసుకుంటుందని చెప్పారు. ఈ ఎన్నికల్లో మహాకూటమి అభ్యర్థి విజయం కోసం అందరూ కృషి చేయాలన్నారు. సమయం లేదు మిత్రమా.. ఎన్నికల ప్రచారంలో దూసుకుపోండి అని కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. తెలంగాణలో కూటమి అధికారంలోకి రాబోతుందని చెప్పారు.
అప్పులపాలు చేశారు
టీఆర్ఎస్ ఎన్నో హామీలు ఇచ్చి ఏ ఒక్కటీ అమలు చేయలేదని బాలకృష్ణ అన్నారు. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పులపాలు చేశారని చెప్పారు. పెత్తందారుల రాజ్యం తీసుకురావాలని తెరాస ప్రయత్నిస్తోందని చెప్పారు. తెలంగాణలో టీడీపీకి పూర్వ వైభవం తీసుకు వస్తామని చెప్పారు. పదవుల కోసమో, కాంట్రాక్టుల కోసమో టీడీపీ కార్యకర్తలు వెంపర్లాడరని చెప్పారు. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజలు కష్టాల్లో ఉంటే ఆదుకునే పార్టీ టీడీపీ అన్నారు.
అవినీతి విలయతాండవం
ఎన్నికల ప్రచారానికి రెండు రోజుల సమయం మాత్రమే మిగిలి ఉందని, కార్యకర్తలంతా కష్టపడి పనిచేసి ప్రజాకూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని బాలకృష్ణ సూచించారు. ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరుతో పెద్ద ఎత్తున దోచుకుంటున్నారని చెప్పారు. అక్షరాస్యతలో తెలంగాణ దిగజారిపోయిందని, మద్యం అమ్మకాల్లో మాత్రం టాప్గా నిలిచిందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో అవినీతి విలయతాండవం చేస్తోందన్నారు.
చంద్రబాబుకు మూడ్ వస్తే ప్రపంచమంతా తిరుగుతారు
తెరాస ప్రభుత్వం మాత్రం ఇప్పుడున్న పాఠశాలలనే మూసివేస్తూ, ప్రజలకు మద్యం అలవాటు చేస్తూ బాంచన్ దొర నీ కాళ్లు మొక్కుతాననే పెత్తందారి సంస్కృతికి బీజం వేస్తోందని బాలకృష్ణ అన్నారు. హైటెక్ సిటీ రావడానికి, సైబరాబాద్ నిర్మాణానికి, ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి.. వీటన్నింటికి చంద్రబాబు కారణం అన్నారు. చంద్రబాబుకు మూడ్ వస్తే ఊరుకోరనీ, రాష్ట్రం అభివృద్ధి కోసం ప్రపంచమంతా తిరుగుతారన్నారు.
సుహాసినిని గెలిపించండి
కేసీఆర్ తన కేబినెట్లో ఒక్క మహిళకు కూడా చోటివ్వలేదని బాలకృష్ణ చెప్పారు. కేసీఆర్కు అధికారం అప్పగిస్తే పెత్తందారీ వ్యవస్థను తీసుకు వచ్చారని చెప్పారు. తెలంగాణ ఆత్మహత్యల్లో రెండో స్థానంలో ఉందని చెప్పారు. కేసీఆర్ ప్రజా వ్యతిరేక విధానాలు నచ్చని నేతలు పలువురు టీడీపీలో చేరారని చెప్పారు. కేసీఆర్ ఇచ్చిన హామీలు అమలు చేయలేదన్నారు. నందమూరి సుహాసినికి ఓటు వేసి గెలిపించాలన్నారు.