టీడీపీకి ఓటంటే అభివృద్ధికి ఓటు: జూబ్లిహిల్స్లో ఓటేసిన బాలకృష్ణ
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీకి ఓటంటే అది అభివృద్ధికి ఓటు వేసినట్లేనని సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో భాగంగా ఆయన మంగళవారం బంజారాహిల్స్లోని బీఎస్ఎన్ఎల్ భవన్లో ఏర్పాటు చేసిన పోలింగ్ స్టేషన్లో ఓటు వేశారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ప్రజల్లో చైతన్యం పెరిగి ఓటు వేసేందుకు ముందుకొచ్చారని ఆయన అన్నారు.
హైదరాబాద్ అభివద్ధి చెందడానికి టీడీపీనే కారణమనన్నారు. తప్పుకుండా తెలుగుదేశం ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తుందన్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉన్నప్పుడు టీడీపీ హయాంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయన్నారు. ముఖ్యంగా ఐటీ, హైదరాబాద్ సెక్యూరిటీ విషయంలో పలు విప్లవాత్మక మార్పులు జరిగాయన్నారు.
నాన్నగారు చేయలేని కొన్ని పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేశారని కొనియాడారు. తెలుగుదేశం పార్టీకి ఓటంటే అది అభివృద్ధికి ఓటు అని చెప్పారు. గ్రేటర్ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటేయాలని పిలుపునిచ్చారు. ఈనెల 27,28వ తేదీన లేపాక్షి ఫెస్టివల్కు ఏపీ సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరవుతారన్నారు.
ఈనెల 4న తాను ఢిల్లీకి వెళ్లి కేంద్ర పర్యాటక మంత్రిని ఆహ్వానించనున్నట్లు తెలిపారు. ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్తో పాటు తెలంగాణ దేవాదాయ, పర్యాటక శాఖ మంత్రలను కూడా ఆహ్వానిస్తామన్నారు. కర్ణాటక నుంచి కూడా మంత్రులు రానున్నట్లు బాలయ్య చెప్పారు. వారందరినీ లేపాక్షి ఫెస్టివల్లో గౌరవించడం జరుగుతుందన్నారు.