కేసీఆర్ను గెలిపిస్తే హైదరాబాద్ క్షేమం... వరదలు ఎవరూ ఆపలేరు... జీహెచ్ఎంసీ ఎన్నికలపై పోసాని
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తే హైదరాబాద్ నగరం క్షేమంగా ఉంటుందని సినీ నటుడు పోసాని కృష్ణమురళి అన్నారు. ఈ ఆరున్నరేళ్ల పాలనలో కేసీఆర్ సమర్థత,నిబద్దత వల్లే రాష్ట్రంలో తక్కువ సమయంలోనే ఎక్కువ అభివృద్ది జరిగిందన్నారు. విద్యుత్,సాగునీటి ప్రాజెక్టులు,శాంతిభద్రతలు.. ఇలా చాలా విషయాల్లో తెలంగాణ రాష్ట్రం అభివృద్ది పథంలో ముందుకు సాగుతోందన్నారు. తెలంగాణ,ఆంధ్రా అన్న బేధం లేకుండా ప్రతీ ఒక్కరి పట్ల సోదర భావంతో కేసీఆర్ పాలన సాగుతోందన్నారు. అందుకే ఈ ఆరున్నరేళ్లలో ఎక్కడా ఎవరిపై దాడులు జరగలేదన్నారు. కాబట్టి గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ను గెలిపిస్తే హైదరాబాద్ క్షేమంగా ఉంటుందన్నారు. హైదరాబాద్లో నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో దర్శకుడు ఎన్.శంకర్తో కలిసి పోసాని మీడియాతో మాట్లాడారు.
కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక...
కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాకే రాష్ట్రంలో 24గంటలు విద్యుత్ అందుబాటులోకి వచ్చిందన్నారు. దేశంలోనే ఎక్కడా లేని రీతిలో అతిపెద్ద ఎత్తిపోతల పథకం కాళేశ్వరం నిర్మించి రాష్టాన్ని సస్యశ్యామలం చేశారని చెప్పారు. అలాగే మిషన్ కాకతీయ,మిషన్ భగీరథ పథకాలు చేపట్టారన్నారు. హైదరాబాద్లో ఉన్న ఆంధ్రావాళ్లు.. ఈ ఆరున్నరేళ్లలో ఏదైనా ఇబ్బంది కలిగిందా అని తమను తాము ప్రశ్నించుకోవాలన్నారు. ఆంధ్రా వాళ్లు కూడా ఇక్కడ ఎమ్మెల్యేలు అయ్యారని గుర్తుచేశారు.
వరదలు ఎవరూ ఊహించలేరు...
వరదల గురించి ప్రస్తావించిన పోసాని... హైదరాబాద్కు వరదలు వస్తాయని ఎవరూ ఊహించలేరన్నారు. ఎప్పుడో వందేళ్ల క్రితం నిజాం పాలనలో వరదలు వచ్చి వందలాది మంది చనిపోయారని గుర్తుచేశారు. వరదల ప్రభావంతో అప్పటి నిజాం.. ఆనాటి 15లక్షల హైదరాబాద్ జనాభాను దృష్టిలో ఉంచుకుని డ్రైనేజీ వ్యవస్థ నిర్మించారన్నారు. ఇప్పటికీ అదే డ్రైనేజీ వ్యవస్థ ఉందన్నారు. అయితే ప్రజలు,చోటా మోటా నేతలు చెరువులు,నాలాలను ఆక్రమించడం,ప్రభుత్వాలు అనుమతులు ఇవ్వడంతో నష్టం జరిగిందన్నారు. కేసీఆర్ లాంటి వారు లక్ష మంది ఉన్నా.. కేంద్రమే జోక్యం చేసుకున్నా వరదలను ఎవరూ ఆపలేరని అన్నారు. కాబట్టి దీన్ని ప్రభుత్వ అలసత్వంగా భావించకూడదన్నారు.
టీఆర్ఎస్ను గెలిపించాలన్న పోసాని
టీఆర్ఎస్ పాలనలో శాంతిభద్రతల విషయంలో దేశంలోనే తెలంగాణ అగ్ర స్థానంలో ఉందన్నారు. డీజీపీ మహేందర్ రెడ్డి,కమిషనర్ అంజనీ కుమార్,సైబరాబాద్ సీపీ సజ్జనార్ నేత్రుత్వంలో పోలీస్ శాఖ సమర్థవంతంగా పనిచేస్తోందన్నారు. దిశ ఎన్కౌంటర్ పట్ల ప్రభుత్వం ఎలా స్పందించిందో ప్రతీ ఒక్కరూ చూశారని గుర్తుచేశారు. ఒకప్పుడు నగరంలో పెద్ద సంఖ్యలో చైన్ స్నాచింగ్లు జరిగేవని... ఇప్పుడవి 90శాతం తగ్గిపోయాయని అన్నారు. ఇటీవలే గచ్చిబౌలిలో పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశారని గుర్తుచేశారు.కాబట్టి ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
Recommended Video
దర్శకుడు ఎన్ శంకర్ ఏమన్నారంటే...
ప్రముఖ దర్శకుడు ఎన్.శంకర్ మాట్లాడుతూ.. గత 2016 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కేటీఆర్ ఏదైతే చెప్పారో... ఆ విజన్ని అమలుచేసి చూపించారన్నారు. ముఖ్యంగా ఈ ఆరున్నరేళ్లలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్కడా విద్వేషాలకు,విధ్వంసాలకు తావు ఇవ్వకుండా పాలన సాగించారని గుర్తుచేశారు. కాళేశ్వరం లాంటి భారీ ప్రాజెక్టును స్వప్నించడమే కాదు... దాన్ని నిర్మించి చూపించారన్నారు. 24గంటల విద్యుత్ను సవాల్గా తీసుకుని దాన్ని కూడా నెరవేర్చారన్నారు. రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్కి దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు దక్కిందన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత మంత్రి కేటీఆర్ చొరవతో... ప్రపంచంలోనే టాప్ కంపెనీలైన ఫేస్బుక్,,గూగుల్,యాపిల్,అమెజాన్ తమ రెండో అతిపెద్ద కార్యాలయాలను హైదరాబాద్లో నెలకొల్పాయన్నారు. వరదల సందర్భంలో ప్రభుత్వం స్పందించిన తీరును గమనించాలన్నారు. అనుకోని ఘటనల్లో అక్కున చేర్చుకునే... రాష్ట్రాన్ని అభివృద్ది పథంలో నడిపించే టీఆర్ఎస్ పార్టీనే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.