చంపేస్తారా ఏంటి.. రాహుల్ సిప్లిగంజ్కు ఎవరూ లేరనుకోవద్దు..: పబ్లో దాడిపై ప్రకాష్ రాజ్
ఇటీవల హైదరాబాద్ గచ్చిబౌలిలోని ప్రిజమ్ పబ్లో బిగ్ బాస్ విజేత,సింగర్ రాహుల్ సిప్లిగంజ్పై దాడిని నటుడు ప్రకాష్ రాజ్ ఖండించారు. సోమవారం రాహుల్తో కలిసి తెలంగాణ అసెంబ్లీకి వచ్చిన ఆయన.. ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ను కలిశారు. రాహుల్పై దాడి చేసినవారిపై చర్యలు తీసుకోవాలని.. నిందితులకు శిక్ష పడాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
Recommended Video
పబ్కు వెళ్తే చంపేస్తారా..
పబ్కు వెళ్తే చంపేస్తారా అని మీడియాతో మాట్లాడుతూ ప్రకాష్ రాజ్ ప్రశ్నించారు. దాడి చేయడం తప్పని అన్నారు. రాహుల్కు ఎవరూ లేరు అనుకోవద్దని.. సినీ పరిశ్రమ అతని వెంట ఉందని చెప్పారు. అలాగే రాహుల్ అభిమానులు కూడా అండగా ఉన్నారని అన్నారు. పబ్లోకి వెళ్లడం తప్పని చెప్పట్లేదని.. కానీ సీసాలతో దాడి చేయడమేంటని ప్రశ్నించారు. ఒక్కడిపై పది మంది దాడి చేయడమేంటన్న ప్రకాష్ రాజ్.. ఆ అహంకారం తప్పన్నారు.
రాహుల్కు రాజీ పడే ఉద్దేశం లేదన్న ప్రకాష్ రాజ్
రాహుల్కు రాజీపడే ఉద్దేశం లేదన్నారు. అయినా తప్పు చేయనప్పుడు రాజీపడాల్సిన అవసరం లేదన్నారు. దీనిపై మంగళవారం కమిషనర్ను కూడా కలిసి మాట్లాడుతానన్నారు. ఇద్దరి మధ్య గొడవలున్నా.. భిన్నాభిప్రాయాలున్నా.. కలిసి మాట్లాడుకోవాలి గానీ ఇలా దాడులు చేయడమేంటని నిలదీశారు. రాహుల్ కేసు పెట్టాడని.. న్యాయం కోసం చట్టబద్దంగా పోరాడుతాడని చెప్పుకొచ్చారు.
ప్రిజమ్ పబ్లో దాడి...
బుధవారం (మార్చి 5,2020) రాత్రి 11.30గంటల సమయంలో గచ్చిబౌలిలోని ప్రిజమ్ పబ్లో రాహుల్ సిప్లిగంజ్పై జరిగింది. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సోదరుడు రితేశ్ రెడ్డి అతని సోదరులు కలిసిరాహుల్ తలపై బీరు బాటిల్స్తో దాడి చేశారు.దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మరుసటిరోజు ఉదయం రాహుల్ సిప్లిగంజ్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి చర్యలు తీసుకోవాలని కోరాడు. అటు పబ్ యాజమాన్యం కూడా పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రితేశ్ రెడ్డితో పాటు మరో ఆరుగురిపై ఐపీసీ సెక్షన్ 324, 34 రెడ్విత్ కేసు నమోదు చేశారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది.