థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్కు రోడ్డు ప్రమాదం... ధ్వంసమైన కారు...
ఎస్వీబీసీ మాజీ ఛైర్మన్,ప్రముఖ నటుడు పృథ్వీరాజ్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. మంగళవారం(అక్టోబర్ 20) మధ్యాహ్నం సమయంలో ఆయన ప్రయాణిస్తున్న కారును మరో కారు ఢీకొట్టింది. హైదరాబాద్లోని బంజారాహిల్స్ క్యాన్సర్ ఆస్పత్రి వద్ద జరిగిన ఈ ప్రమాదంలో పృథ్వీ కారు ధ్వంసమైంది. పృథ్వీ తన కారులో క్యాన్సర్ ఆస్పత్రి సమీపంలోని వినాయకుడి గుడి వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద అనంతరం స్థానిక జనం అక్కడ పెద్ద ఎత్తున గుమిగూడారు. ప్రమాదానికి గురైన కారు ఫోటోను పృథ్వీరాజ్ టీమ్ ఫేస్బుక్లో షేర్ చేశారు. అయితే పృథ్వీ పరిస్థితి గురించి అందులో ఎలాంటి వివరాలు పేర్కొనలేదు.
ఈ ఏడాది అగస్టులో కరోనా బారినపడిన పృథ్వీరాజ్.. ఆ తర్వాత కొద్దిరోజులకు కోలుకున్న సంగతి తెలిసిందే. గతంలో ఎస్వీబీసీ ఛైర్మన్గా పనిచేసిన ఆయన... ఓ మహిళతో ఆడియో టేపుల వ్యవహారం వెలుగుచూడటంతో తన పదవికి రాజీనామా చేసిన విషయం విదితమే. ఆ ఆడియో టేపుల్లో ఉన్నది తన గొంతు కాదని పృథ్వీ వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేసినప్పటికీ... ఆ వివాదానికి అంతటితో ఫుల్ స్టాప్ పెట్టాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఆయనతో రాజీనామా చేయించింది. దీంతో కావాలనే తనను ఇరికించారంటూ పృథ్వీ అప్పట్లో ఆరోపణలు చేశారు.
తనకు ఎస్వీబీసీ ఛైర్మన్ రావడం కొందరికి నచ్చలేదని... అందుకే కుట్రపూరితంగా ఆడియో టేపు లీకేజీ వ్యవహారాన్ని తెరపైకి తెచ్చారని ఆరోపించారు. నిజానికి ఈ వ్యవహారంపై విజిలెన్స్ నివేదిక తర్వాత చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావించినప్పటికీ... అప్పటికే వివాదం ముగియడంతో పృథ్వీ అయిష్టంగానే రాజీనామా చేయక తప్పలేదు.