అందుకే! కేసీఆర్ను ఏపీ ప్రజలూ అభినందిస్తున్నారు: సుమన్
ప్రముఖ సినీ నటుడు సుమన్.. తెలంగాణ ముఖ్యమంత్రి, టిఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖర్ రావును మరోసారి ప్రశంసలతో ముంచెత్తారు.
హైదరాబాద్: ప్రముఖ సినీ నటుడు సుమన్.. తెలంగాణ ముఖ్యమంత్రి, టిఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖర్ రావును మరోసారి ప్రశంసలతో ముంచెత్తారు. కేసీఆర్ దీక్ష చేసి చేసి ఏడేళ్లైన సందర్భంగా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద దీక్షా దివస్ కార్యక్రమం నిర్వహించారు.
మంగళవారం ఉదయం ప్రారంభమైన దీక్షా దివస్ సాయంత్రం వరకు కొనసాగింది. ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు సుమన్. తెలంగాణ రాదని చాలామంది అన్నారని, అయితే, కేసీఆర్ దీక్ష చేపట్టడంతో తెలంగాణ ఇవ్వక తప్పలేదన్నారు.
తెలంగాణ ఏర్పడటంతో ఆంధ్రప్రదేశ్లోనూ అభివృద్ధి ప్రారంభమైందన్నారు. దీంతో ఆంధ్ర, రాయలసీమ ప్రజలు కూడా కేసీఆర్ను అభినందిస్తున్నారని సుమన్ చెప్పారు. నవంబర్ 29న సెలవు ప్రకటించాలన్నారు. తెలంగాణ కథ ఇతివృత్తంగా నిర్మిస్తోన్న సినిమాలో తాను మంచి పాత్ర పోషిస్తున్నట్లు సుమన్ వెల్లడించారు.
కాగా, ఈ కార్యక్రమం మొత్తం కళాకారులు డప్పు చప్పుళ్లు.. ఆటపాటలతో ఉత్సాహపరిచారు. హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి, ప్రజాకవి గోరటి వెంకన్న కళాకారులతో కలిసి చిందేసి హుషారెత్తించారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు రమణాచారి, ఎమ్మెల్యే శ్రీనివాస్గౌడ్, సినీనటుడు సుమన్తో పాటు పలువురు నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు.
తెలంగాణ సాధనకోసం కేసీఆర్ నిరాహారదీక్ష చేపట్టిన రోజుని చాలా పవిత్రమైన రోజుగా నాయిని అభివర్ణించారు. దీక్ష కోసం ఆనాడు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టిఆర్ఎస్ పాల్గొనలేదని గుర్తు చేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత పోటీ చేసి తమ సత్తా ఏంటో చూపించామని అన్నారు.