‘గివ్ ఇట్ అప్’: ప్రధాని మోడీ పిలుపునకు స్పందించిన నటి అమల
హైదరాబాద్: అవసరం లేని వారు గ్యాస్ సబ్సిడీని వదులుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపునకు ఇప్పటికే చాలా మంది స్పందించారు. ఇప్పుడు ఆ జాబితాలో పెటా ఉద్యమకర్త, నటి, ప్రముఖ సినీనటుడు నాగార్జున సతీమణి అక్కినేని అమల కూడా చేరిపోయారు.
ఈ మేరకు 'గివ్ ఇట్ అప్' దరఖాస్తుపై సంతకాలు చేసిన అమల, ఆ పత్రాలను ఆయిల్ కంపెనీ ప్రతినిధికి అందజేశారు. ఆమెతోపాటు కుటుంబసభ్యులు మరో ఐదుగురు కూడా 'గివ్ ఇట్ అప్' చేసినట్లు హైదరాబాద్ ఏరియా సేల్స్ మేనేజర్ ఉమాపతి తెలిపారు.
ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకే ఆమె సబ్సిడీని వదులకున్నారని తెలిపారు. కాగా, ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 15 లక్షల మంది సబ్సిడీని వదులుకోగా, అందులో తెలంగాణ హెచ్పీసీఎల్ వినియోగదారులు 13,420 మంది ఉన్నారని తెలిపారు.
అవసరం లేని వారు సబ్సిడీని వదులు కోవడం వల్ల పేదలకు ఇచ్చే సబ్సిడీలు పెంచవచ్చే ఆలోచనతో ప్రధాని నరేంద్ర మోడీ ‘గివ్ ఇట్ అప్' పిలుపునిచ్చారు. కాగా, ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణులు సానియా మీర్జా, గుత్తా జ్వాలాలు కూడా గ్యాస్ సబ్సిడీని వదులుకున్నారు.