ఆ ప్రచారం బాధాకరం... అసలు జరిగింది ఇదీ... నటి ఆమని ఆవేదన...
సోషల్ మీడియాలో తన ఆరోగ్యం గురించి కొద్ది రోజులుగా జరుగుతోన్న ప్రచారంపై సినీ నటి ఆమని స్పందించారు. తాను గుండెపోటుకు గురయ్యానంటూ జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నారు. అవన్నీ వట్టి పుకార్లేనని... తాను ఆరోగ్యంగా ఉన్నానని స్పష్టం చేశారు. ఇటీవల ఓ సినిమా షూట్ నిమిత్తం మంచిర్యాల జిల్లాకు వెళ్లినప్పుడు అస్వస్థతకు గురైన మాట నిజమేనన్నారు. ఫుడ్ పాయిజన్ కారణంగా తనతో పాటు చిత్ర యూనిట్లోని 20 మంది అస్వస్థతకు గురైనట్లు చెప్పారు. దీన్ని గుండెపోటుకు గురైనట్లుగా చిత్రీకరించడం బాధాకరమన్నారు. అందుకు వెంటనే చికిత్స తీసుకున్నామని... ప్రస్తుతం తాను క్షేమంగానే ఉన్నానని తెలిపారు. నటీనటులపై ఇటువంటి పుకార్లు పుట్టించడం సరికాదన్నారు.
కాగా,మంచిర్యాల జిల్లాకు చెందిన గేయ రచయిత తైదల బాపు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఓ చిత్రంలో ప్రస్తుతం ఆమని నటిస్తున్నారు.ఇటీవల మంచిర్యాలలో కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరిస్తున్న సమయంలో ఆమె అస్వస్థతకు గురయ్యారు. దీంతో చిత్ర యూనిట్ సభ్యులు హుటాహుటిన ఆమెను మంచిర్యాలలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు భయపడాల్సిన అవసరం లేదని తెలిపారు. చికిత్స అనంతరం ఆమనిని డిశ్చార్జ్ చేశారు. ఇదే సమయంలో ఆస్పత్రి సిబ్బంది కొంతమంది ఆమనితో ఫోటోలు దిగి సోషల్ మీడియాలో షేర్ చేశారు.
Recommended Video
ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కాగా... కొంతమంది ఆమెకు గుండెపోటు వచ్చిందని,తీవ్ర అనారోగ్యంతో ఉన్నారని ఇలా రకరకాలుగా ప్రచారం చేశారు. సోషల్ మీడియా పోస్టులు ఆమని దృష్టికి వెళ్లడంతో స్వయంగా ఆమె దీనిపై వివరణ ఇచ్చుకున్నారు.తెలుగులో శుభలగ్నం,మిస్టర్ పెళ్లాం,ఘరానా బుల్లోడు,ఆ నలుగురు వంటి సినిమాలతో ఆమని మంచి గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. కొన్నాళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉన్న ఆమని సెకండ్ ఇన్నింగ్స్లో మళ్లీ స్పీడ్ పెంచారు. ప్రస్తుతం చావు కబురు చల్లగా,మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రాల్లో నటిస్తున్నారు.