బీజేపీలో చేరిన సినీ నటి మాధవీలత: ఇక పవన్ జనసేనకు ప్రచారం లేనట్లే!
హైదరాబాద్: ప్రముఖ సినీ నటి, హీరోయిన్ మాధవీలత శనివారం భారతీయ జనతా పార్టీలో చేరారు. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, బీజేపీ సీనియర్ నేతలు బండారు దత్తాత్రేయ సమక్షంలో ఆమె బీజేపీలో చేరారు.
పార్టీ అభివృద్ధికి పాటుపడతా
మాధవీలతకు కాషాయ కండువా కప్పి నేతలు బీజేపీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాధవీలత మాట్లాడారు. బీజేపీ అభివృద్ధికి తనవంతుగా కృషి చేస్తానని ఆమె తెలిపారు.
పవన్కు మద్దతు..
ప్రముఖ సినీ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్కు వీరాభిమాని అయిన మాధవీలత ఇప్పుడు బీజేపీలో చేరడం చర్చనీయాంశంగా మారింది. కాగా, గత కొద్ది రోజులుగా టాలీవుడ్లో చెలరేగుతున్న వివాదాలపై కూడా మాధవీలత తరచూ స్పందించారు.
పవన్కు ప్రచారం చేస్తానని
ఇటీవల పవన్పై నటి శ్రీరెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఫిలిం ఛాంబర్ వద్ద నిరసన దీక్ష కూడా చేపట్టారు మాధవీలత. అంతేగాక, పవన్ పార్టీ జనసేన తరపున తాను ప్రచారం కూడా చేస్తానని మాధవీలత చెప్పిన విషయం తెలిసిందే.
ఊహించని విధంగా..
ఈ క్రమంలో మాధవీలత జనసేన పార్టీలో చేరుతున్నారంటూ ప్రచారం కూడా జరిగింది. అయితే, ఎవరూ ఊహించని విధంగా ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో మాధవీలత చేరడం చర్చకు దారితీసింది. ఇక ఆమె తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ తరపున ప్రచారం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.