మీరా చోప్రా ఫిర్యాదు: ట్విట్టర్కు హైదరాబాద్ పోలీసుల నోటీసులు, చర్యలు తప్పవంటూ వార్నింగ్
హైదరాబాద్: ప్రముఖ సోషల్ మీడియా ట్విట్టర్ తన నిర్లక్ష్య వైఖరితో మరిన్ని కష్టాలను కొనితెచ్చుకుంటోంది. తాజాగా, ట్విట్టర్కు హైదరాబాద్ క్రైమ్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. అసభ్యకర పోస్టులు, వివాదాస్పద వ్యాఖ్యలు, వీడియోలను పోస్టు చేసిన వ్యక్తుల వివరాలు తెలపనందుకు ఈ మేకు తాఖీదులు జారీ చేశారు. స్పందించని పక్షంలో నిందితులుగా పరిగణించాల్సి వస్తుందంటూ హెచ్చరించారు.
సినీనటి మీరా చోప్రా ఫిర్యాదు..
వివరాల్లోకి వెళితే.. సినీ నటి మీరా చోప్రాపై కొందరు యువకులు గత ఏడాది జూన్లో ట్విట్టర్ వేదికగా అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైం పోలీసులు.. ఈ వ్యాఖ్యలు, బెదిరింపులను వెంటనే తొలగింపజేశారు. అయితే, వాటిని పోస్టు చేసినవారెవరో చెప్పాలంటూ ట్విట్టర్కు నోటీసులు పంపారు. ఏడాది గడిచినా కూడా ట్విట్టర్ ప్రతినిధులు ఇప్పటికీ స్పందించలేదు.
ట్విట్టర్కు హైదరాబాద్ పోలీసుల హెచ్చరిక
తాజాగా, పోలీసులను కించపరిచేలా ఇద్దరు యువకులు ఓ వీడియోను పోస్టు చేశారు. పోలీసులు ఓ యువకుడ్ని గుర్తించి ఆ పోస్టును తొలగింపజేశారు. అంతేగాక, ఇద్దరు యువకులతోపాటు ట్విట్టర్పైనా కేసు నమోదు చేశారు. వ్యక్తులతోపాటు పోలీసుల ప్రతిష్టకు భంగం కలిగే వీడియోలకు బాధ్యులు మీరేనంటూ పోలీసు అధికారులు ట్విట్టర్కు ఇ మెయిల్ ద్వారా తాఖీదులు పంపారు. గడువులోగా సమాధానం ఇవ్వకపోతే దేశంలో బాధ్యులైన అధికారులను గుర్తించి సీఆర్పీసీ నోటీసులు జారీ చేయనున్నామని స్పష్టం చేశారు.
భావ ప్రకటనా స్వేచ్ఛ ఉన్నా..
భావ ప్రకటనా స్వేచ్ఛ ప్రజల హక్కు అయినప్పటికీ.. వ్యక్తులు, వ్యవస్థలను కించపర్చేలా ఉండే పోస్టులను, వీడియోలను అనుమతించడం చట్టప్రకారం నేరమని సైబర్ క్రైమ్ పోలీసు ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. కాగా, పలువురు బాధితుల ఫిర్యాదు మేరకు ఇప్పటికే ట్టిట్టర్పై ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్ పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.
ట్విట్టర్పై కేంద్రం ఆగ్రహం
ఇది ఇలావుండగా, ట్విట్టర్పై చర్యలు తీసుకునేందుకు కేంద్రం సిద్దమవుతోంది. చాలా రోజుల క్రితం ట్విట్టర్కు భారతప్రభుత్వం సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. పార్లమెంట్ ప్యానల్ సమన్లు జారీ చేసిన తరువాత ట్విట్టర్ తాత్కలిక ఛీఫ్ కంప్లయన్స్ అధికారిని నియమించింది. ఇచ్చిన గడువు లోపల ట్విట్టర్ చీఫ్ కంప్లయన్స్ అధికారిని నియమించలేదని కేంద్రం పేర్కొంది. ట్విట్టర్పై చర్యలు తీసుకునేందుకు సిద్దమైంది. అధికారిని ఆలస్యంగా నియమించడంతో భారత్లో చట్టపరమైన రక్షణను కోల్పోయినట్టు కేంద్రం తెలియజేసింది. చట్టపరమైన రక్షణను కోల్పోవడంతో ట్వట్టర్పై చర్యలు తీసుకోవడానికి కేంద్రం సిద్ధమైంది. దేశంలో పనిచేయాలనుకుంటే ఇక్కడి చట్టాలను పాటించాల్సిందేనని కేంద్రం ఇప్పటికే ట్విట్టర్కు తేల్చి చెప్పింది.
Recommended Video