ఆస్తుల అమ్మకంలో మోసం: మద్రాసు కోర్టుకు విజయశాంతి
హైదరాబాద్/చెన్నై: సినీనటి, మాజీ ఎంపీ విజయశాంతి సోమవారం మద్రాసు హైకోర్టుకు హాజరుకానున్నారు. ఆ వివరాల్లోకి వెళితే.. ఆస్తుల విక్రయం కేసులో మద్రాసు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. విజయశాంతి నుంచి తాను కొనుగోలు చేసిన ఆస్తులను ఆమె మరొకరికి విక్రయించారంటూ ఇందర్చంద్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన కోర్టు ఈ నోటీసులు జారీ చేసింది.
ఆస్తుల అమ్మకం
ఎగ్మూరులో విజయశాంతికి చెందిన స్థిరాస్తులను ఇందర్చంద్ 2006లో రూ.5.20 కోట్లకు కొనుగోలు చేశారు. ఇందుకు సంబంధించిన పవరాఫ్ అటార్నీ పత్రాలను కూడా తీసుకుని విజయశాంతికి రూ.4.68 కోట్లు అందించారు.
మోసం చేశారంటూ..
అయితే తాను కొనుగోలు చేసిన ఆస్తులను ఆమె వేరొకరికి విక్రయించారంటూ ఇందర్ స్థానిక జార్ట్ టౌన్ కోర్టు కేసు వేశారు. విజయశాంతిపై చర్యలు తీసుకోవాల్సిందిగా అందులో కోరారు. అయితే కోర్టు ఆయన పిటిషన్ను కొట్టివేసింది.
సామరస్యంగా..
ఈ నేపథ్యంలో ఇందర్ చంద్ మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. శనివారం ఇందర్ చందర్ పిటిషన్ విచారణకు రాగా వివాదాన్ని ఇద్దరూ సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని ఆదేశిస్తూ విచారణను సోమవారం వాయిదా వేసింది.
నేడు కోర్టుకు..
విజయశాంతి స్వయంగా కోర్టుకు హాజరు కావాల్సిందిగా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో విజయశాంతి సోమవారం మద్రాసు హైకోర్టు ముందు హాజరుకానున్నారు.