షాకింగ్ : కరోనా నంబర్స్పై సీసీఎంబీ సంచలనం.. అసలు లెక్క 10 రెట్లు ఎక్కువ..
కరోనా లాక్ డౌన్ ప్రకటించిన తొలినాళ్లలో ప్రజల్లో కనిపించిన సీరియస్నెస్ ఇప్పుడు కనిపించట్లేదు. వందల్లో కేసులు ఉన్నప్పుడు వణికిపోయిన జనం.. కేసుల సంఖ్య లక్షల్లోకి చేరాక మాత్రం పెద్దగా పట్టించుకోవట్లేదు. ప్రభుత్వాల వైఖరి కూడా ఇందుకు ఓ కారణమన్న వాదన వినిపిస్తోంది. మద్యం షాపులకు అనుమతివ్వడంతో చాలామంది ప్రజలు ప్రభుత్వాలను చీదరించుకున్నారు. అలాగే కేసుల సంఖ్య తక్కువగా ఉన్నప్పుడు వలస కూలీలను వదిలేసి.. కేసులు తీవ్ర రూపం దాల్చాక వారిని తరలించడంపై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దేశంలో పెరుగుతున్నకేసులపై తాజాగా సీసీఎంబీకి చెందిన ఓ అధికారి ఒకరు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
వీడని కరోనా భయం- ముందుకు రాని జనం- ఏపీఎస్ ఆర్టీసీ సర్వీసుల వెలవెల...
రియాలిటీ.. 10 రెట్లు ఎక్కువగా..
దేశంలో ఇప్పటివరకూ 1,45,354 మంది కరోనా బారిన పడ్డారు. ఇందులో 60,706 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జి అవగా ప్రస్తుతం 80,463 యాక్టివ్ కేసులు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకూ కరోనాతో మొత్తం 4174 మంది మృత్యువాతపడ్డారు. అయితే కరోనా కేసులకు సంబంధించి ఈ లెక్కలు ఎంతవరకు నమ్మశక్యం అన్న ప్రశ్న తలెత్తుతోంది. సీసీఎంబీ అధికారి కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం భారత్లో ఒక మిలియన్ జనాభాకు 2268 కరోనా టెస్టులు జరుగుతుండగా.. టెస్టుల సంఖ్యను పెంచితే వాస్తవ లెక్కలు భారీ సంఖ్యలో ఉండే అవకాశం ఉందన్నారు. రియాలిటీలో దాదాపు 10 రెట్లు కేసులు ఎక్కువగా ఉండవచ్చన్నారు.
కేసుల పెరుగుదలకు కారణమేంటి..
దేశంలో వైరస్ టెస్టుల సంఖ్య తక్కువగా ఉండటం.. చేస్తున్న టెస్టుల్లోనూ కచ్చితత్వం లేకపోవడంతో ఇప్పుడున్న నంబర్లను నమ్మేందుకు అవకాశం లేదన్నారు. వైరస్ మనుషుల నుంచి మనుషులకు వేగంగా వ్యాప్తి చెందుతుందని.. అలాగే వస్తువుల ఉపరితలంపై నుంచి కూడా వ్యాప్తి చెందుతుందని చెప్పారు. వైరస్ ఉన్న వస్తువులను తాకిన చేతులతో ముక్కు లేదా నోటిని తాకితే వైరస్ శరీరంలోకి ప్రవేశిస్తుందన్నారు. లాక్ డౌన్ సడలింపుల నేపథ్యంలో కేసుల సంఖ్య విపరీతంగా పెరిగే అవకాశం ఉందని... వలస కూలీల తరలింపుతో గ్రామీణ ప్రాంతాల్లోనూ కేసులు పెరుగుతాయని చెప్పారు. జూన్ నాటికి కేసులు పీక్స్కి చేరుకుంటాయని.. ఇప్పుడున్న కేసులు దాని ముందు లెక్కకే రావని అన్నారు.
సీసీఎంబీలో 70 వైరస్ జీనోమ్స్..
ప్రస్తుతం సీసీఎంబీలో వైరస్కు సంబంధించి 60 నుంచి 70 వరకు జీనోమ్(జన్యువులు)లను డేటా బేస్లో భద్రపరిచామని చెప్పారు. ఉత్తరాదిలో కనిపిస్తున్న వైరస్కు దక్షిణాదిలో కనిపిస్తున్న వైరస్ జీనోమ్కు తేడాలు గుర్తించామన్నారు. ఢిల్లీ,గుజరాత్లలో కరోనా జీనోమ్కి,దక్షిణాదిలో వైరస్ జీనోమ్ భిన్నంగా ఉందన్నారు. తమిళనాడు,తెలంగాణ రాష్ట్రాల్లో నమోదవుతున్న కరోనా కేసుల్లో ఒకేరకమైన జీనోమ్ ఉన్నట్టు గుర్తించామన్నారు. తమ పరిశోధనలు ఇంకా కొనసాగుతున్నాయని చెప్పారు. వ్యక్తిగత పరిశుభ్రత,ఫిజికల్ డిస్టెన్స్,స్వీయ నియంత్రణ ద్వారానే వైరస్ను ఎదుర్కొనగలమని చెప్పారు.
24 గంటల్లో 146 మంది మృతి..
దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లోనే కరోనాతో 146 మంది మృతిచెందారు. కొత్తగా 6,535 కరోనా కేసులు నమోదవడంతో.. మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,45,380కి చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ మంగళవారం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. గత 24గంటల్లో అత్యధికంగా మహారాష్ట్రలో 52,667 కరోనా కేసులు,తమిళనాడులో 17,082, గుజరాత్లో 14,460, ఢిల్లీలో 14,05 కేసులు నమోదైనట్టు తెలిపింది.