జగిత్యాల వ్యభిచార గృహల్లో వెలుగు చూస్తున్న దారుణాలు.. దీనంగా దత్తత.. దారుణమైన దందా.. !
జగిత్యాల/హైదరాబాద్ : ముక్కుపచ్చలారని అనాథ బాలికలను పెంచుకుంటామంటూ దత్తత తీసుకుంటారు! వారిని తీసుకొచ్చి తమ పిల్లలుగా తప్పుడు పత్రాలు సృష్టిస్తారు. వారిని పెంచి పెద్ద చేసి.. యుక్తవయసులోకి వచ్చాక వ్యభిచార కూపంలోకి దింపుతారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో జరుగుతున్న దారుణమిది. జిల్లా ఎస్పీ సింధుశర్మ ఆదేశాల మేరకు ధర్మపురిలో వ్యభిచార గృహాలపై జరిగినదాడుల్లో వెలుగుచూసిన ఘోరమిది..! దాడులు చేసిన పోలీసులు.. ఆ గృహాల్లో ఐదుగురు బాలికలను గుర్తించారు.
పసిమొగ్గలను పాపకూపంలోకి నెడుతున్న పాపిస్టి యెదవలు..! పట్టుకున్న పోలీసులు..!!
అనాథలను పెంచుకుంటారు..! పెద్ద చేసి వ్యభిచారంలోకి నెడుతారు కేటుగాళ్లు..!!
అలాంటి వారిలో ఒక బాలికకు ఏడేళ్లు కాగా.. మరో బాలికకు పదేళ్లు. 12 ఏళ్ల బాలికలు ఇద్దరు ఉన్నారు. 17 ఏళ్ల యువతి కూడా ఉంది. వీరంతా ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో చదువుకుంటున్నారు. ఇద్దరు ఐదో తరగతి విద్యార్థినులు కాగా.. మరొకరు ఎనిమిదో తరగతి, ఇంకొకరు ఇంటర్మీడియెట్ చదువుతున్నారు. వ్యభిచార గృహాల నిర్వాహకులు వీరిని వివిధ ప్రాంతాల నుంచి తీసుకొచ్చి.. తప్పుడు వివరాలతో ఆధార్ కార్డులు సృష్టించి, తమ పిల్లలుగానే పెంచుతున్నట్టు సమాచారం. వ్యభిచార నిర్వాహకులు సంజీవ్, కమల, దీప, పద్మ, అశ్విని, కల్పనన అదుపులోకి తీసుకుని ఈ దందాపై ప్రశ్నించగా.. అనేక విషయాలు బయటపడ్డాయి.
డీఎన్ఏ పరీక్షలు..! బాలికలను కాపాడే యత్నంలో యంత్రాంగం..!!
వ్యభిచార ముఠా నిర్వాహకులు ఓ వాట్సాప్ గ్రూపు ఏర్పాటు చేసుకుని ఎవరికీ అనుమానం రాకుండా ఈ దందాను సాగిస్తున్నారు. ముఖ్యంగా అనాథ పిల్లలను లక్ష్యంగా చేసుకుని.. వారిని పెంచుకుంటామనే పేరుతో ధర్మపురికి తీసుకువస్తూ పాపపు పనులు చేయిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. మరికొంత మందిని 10 వేల రూపాయల నుంచి 20 వేల రూపాయలకు కొనుగోలు చేసి పాఠశాల, కళాశాలలో చదివిపిస్తామంటూ ఈ ప్రాంతానికి తీసుకువచ్చి, పెంచి, పెద్ద అయిన తర్వాత వ్యభిచారంలోకి దింపుతున్నారు.
దత్తత పేరుతో దారుణకాండ..! ధర్మపురిలో దారుణం..!!
కాగా.. పోలీసుల అదుపులో ఉన్న బాలికలను కరీంనగర్లోని స్వధార్ హోమ్కు తరలించనున్నారు. అక్కడ బాలికలకు డీఎన్ఏ టెస్టులతో పాటు ఇతర టెస్టులను నిర్వహించి వారి తల్లిదండ్రులను గుర్తించే ప్రయత్నాలు చేస్తున్నారు. వారు ఏ ప్రాంతానికి చెందినవారు. వ్యభిచార గృహాలకు ఎలా చేరారు, ఎంతకాలం నుంచి అక్కడ ఉంటున్నారు తదితరఅంశాలపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పోలీసులు గుర్తించిన వారిలో నలుగురు అనాథలని.. వ్యభిచార గృహాల నిర్వాహకులు చెపుతున్నారు. అందులో ఏమేరకు వాస్తవం ఉందనే విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
జాతీయ రహదారిపైనే..! దారుణమైన దందా..!!
దశాబ్దకాలానికి పైగా.. జగిత్యాల జిల్లాలో వ్యభిచార దందా సాగుతోంది. జగిత్యాల, ధర్మపురిలో జాతీయ రహదారిని ఆనుకుని వ్యభిచార గృహాలు ఏర్పాటు చేశారు. ప్రఖ్యాతిగాంచిన ధర్మపురి లక్ష్మీనృసింహస్వామి క్షేత్ర సమీపంలో దాదాపు 20 నుంచి 25 మంది మహిళలు చాలా కాలంగా ఈ దందా సాగిస్తున్నారు. దీంతో భక్తులు ఆవైపుగా వెళ్లాలంటేనే ఇబ్బందిపడే పరిస్థితి నెలకొంది. అడపాదడపా పోలీసులు దాడులు చేస్తున్నప్పటికీ ఆ దందా యథావిధిగా కొనసాగుతుండడం గమనార్హం.