మ్యాట్రిమోనీ పేరుతో నయా చీట్ : గిప్ట్ కాదంటూనే వంచన...
హైదరాబాద్ : మోసపోయేవారు ఉన్నంత కాలం మోసం చేసేవారి ఆగడాలు కొనసాగుతాయి. ముఖ్యంగా మ్యాట్రిమోనీ పేరుతో మోసాలు కొత్త పొకడలకు దారితీస్తున్నాయి. ఇదివరకు గిప్ట్ల పేరుతో వంచించేవారు. కానీ హైదరాబాద్లో మాత్రం బహుమతి వద్దు మొర్రో అన్న ఛీట్ చేశాడో. ఎలాగో తెలిసి ఆ యువతి కుటుంబం షాక్కు గురైంది. ఆ కేటుగాడు చేసిన వంచనను పోలీసులు మీడియాకు వివరించారు.
ఇలా లైన్లోకి ..
మల్కాజిగిరికి చెందిన యువతి తెలుగు మ్యాట్రిమోనీ.కామ్లో తన పేరు రిజిస్టర్ చేసుకుంది. గత నెలలో డాక్టర్ ఆదీప్ పవన్ పేరుతో ఒకడు లైన్లోకి వచ్చాడు. ఆమె వాట్సాప్ నెంబర్ ఇవ్వాలని మెయిల్ చేశాడు. స్పందించడంతో మనోడు గొప్పలు చెప్పడం మొదలెట్టాడు. తనది తమిళనాడు అని .. వృత్తిరీత్యా జర్మనీలో ఉంటున్నానని కలరింగ్ ఇచ్చాడు. అలా ఛాట్ చేసి చేసి ఒకరోజు ఫోన్ చేశాడు. మమూలుగా మాట్లాడితే సరే .. కానీ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని చెప్పాడు. దీంతో షాక్ తినడం ఆ యువతి వంతైంది. అయినా ఎక్కడో అనుమానం .. కానీ అతగాడి మాయమాటలను మాత్రం విశ్వసించింది.
మాయమాటలు ..
త్వరలో ఇండియా వస్తున్నానని చెప్పాడు. ఇక్కడే ఆస్పత్రి నిర్మించి.. సెటిల్ కావాలనుకుంటున్నానని చెప్పడంతో ఆమె భవిష్యత్పై కలలు కంది. అయితే వచ్చేటప్పుడు బహుమతి తీసుకొస్తానని చెప్పడంతో మళ్లీ అనుమానం .. వద్దని తేల్చిచెప్పింది. అతడు ఫ్రెషర్ చేసినా ఫలితం లేకుండా పోయింది. బహుమతి ఎత్తుగడ ఫలించకపోవడంతో కొత్త ఎత్తుగడతో ముందుకొచ్చాడు.
కండీషన్స్ పేరుతో చీట్
యువతితో పనికాదని భావించాడు. ఆమె కుటుంబసభ్యులతో మాటలు కలిపాడు. ఈ నెల 3న వస్తానని చెప్పాడు. అదేరోజు గుర్తుతెలియని మహిళ నుంచి యువతికి ఫోన్ వచ్చింది. ఢిల్లీ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారి పూజామిశ్రాగా పరిచయం చేసుకుంది. డాక్టర్ అదీప్ పవన్ నిబంధనలకు మించి లక్ష యూరోలను అదనంగా తీసుకొచ్చాడని చెప్పడంతో నమ్మారు. ఫైన్ కింద రూ.1.68 లక్షలు కడితే అతనితోపాటు గిఫ్ట్ కూడా ఇచ్చేస్తామని చెప్పారు. తమ ఖాతాలో నగదు వేయాలని సూచించారు. నిజమని నమ్మ పూజామిశ్రా ఖాతాకు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేశారు. అలా చేయడంతో అదీప్ రెచ్చిపోయాడు.
మళ్లీ .. మళ్లీ ... చివరికీలా
అలా నాలుగైదు సార్లు వివిధ ట్యాక్స్ పేరుతో రే.7.86 లక్షలను గుంజాడు. తొలిసారి మోసపోయిన యువతి, కుటుంబం .. తర్వాత కూడా మోసాన్ని గ్రహించలేదు. దీంతో అదీప్ వారిని వంచిస్తూనే ఉన్నాడు. అయితే చివరగా రూ.9 లక్షలు జమ చేయాలని కోరడంతో .. అప్పుడు యువతి కుటుంబసభ్యులు మేల్కొన్నారు. తాము మోసపోయినట్టు గ్రహించారు. రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. త్వరలోనే మోసగాడిని పట్టుకుంటామని పేర్కొన్నారు.