టీఆర్ఎస్ నేతల బాటలో బీజేపీ ఎంపీ..! అధికారులొస్తే కొట్టండి..
ఆదిలాబాద్ : మొన్న ఎమ్మెల్యే తమ్ముడు.. నిన్న ఎమ్మెల్యే.. నేడు ఎంపీ. ఇదేదో వారు సాధించిన ఘనతల లిస్ట్ కాదు. అటవీ అధికారులపైకి జనాలను ఎగదోస్తున్న ప్రజాప్రతినిధుల జాబితా. కాగజ్ నగర్ సార్సలాలో మహిళా ఎఫ్ఆర్వో అనితపై దాడి ఘటన మరచిపోకముందే కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. అదే క్రమంలో తాజాగా ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ సోయం బాపూరావు చేసిన వ్యాఖ్యలు హాట్ టాపికయ్యాయి.
కాగజ్ నగర్ సార్సలాలో సాక్షాత్తు ఎమ్మెల్యే కోనేరు కోనప్ప తమ్ముడు, జడ్పీ వైస్ ఛైర్మన్ కోనేరు కృష్ణ మహిళా అధికారిణిపై దాడి చేయడం దుమారం రేపింది. అది జరిగిన కొద్దిరోజులకే కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అక్కడి స్థానికులను రెచ్చగొట్టేలా.. అటవీ అధికారులొస్తే తరిమికొట్టండని అభయమిచ్చారు. ఆ రెండు ఘటనలు అలా ఉంటే పోడు భూముల్లోకి ఎవరైనా అధికారులొస్తే కట్టెలతో దాడి చేయండంటూ ఎంపీ సోయం మాట్లాడిన తీరు వివాదస్పదమవుతోంది.
మరో రెవెన్యూ లొల్లి.. డబ్బులు గుంజి పట్టాలు ఇవ్వలేదు..! వీఆర్వో నిర్భందం..!!
పోడు భూముల్లోకి వస్తే కట్టెలతో కొట్టండి..!
ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ సోయం బాపూరావు అటవీ అధికారులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. పోడు భూముల్లోకి వచ్చే అటవీ అధికారులను తరిమికొట్టాలని ఆయన పిలుపునివ్వడం చర్చానీయాంశమైంది. శనివారం నాడు ఉట్నూర్ మండలం మత్తడిగూడలో నిర్వహించిన గిరిజన నేత సిడాం శంబు మొదటి వర్థంతి సభలో ఆయన పాల్గొన్నారు. గిరిజనుల హక్కుల సాధన కోసం దేశ రాజధాని ఢిల్లీలో డిసెంబర్ 9వ తేదీన పెద్ద ఎత్తున ధర్నా చేపట్టనున్నట్లు వివరించారు.
అయితే గిరిజన హక్కులపై మాట్లాడిన సోయం బాపూరావు వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. అటవీశాఖ అధికారులు గిరిజనుల బతుకులను ఆగమాగం చేస్తున్నారని ఫైరయ్యారు. హరితహారం పేరు చెప్పి గిరిపుత్రుల భూముల్లోకి చొరబడితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. పోడు భూముల్లోకి ఎంట్రీ ఇచ్చే అధికారులను కట్టెలతో కొట్టండని పిలుపునిచ్చారు. అంతేకాదు పోడు భూముల్లో మొక్కలు నాటితే పీకి అవతల పారేయండని సూచించారు. అదలావుంటే ఎంపీగా ఉండి ఆయన ఇలా మాట్లాడితే ఎట్లా అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
ఆనాడు అలా.. మహిళా అధికారిణి అని కూడా చూడకుండా..!
ఇటీవల కుమురంభీం జిల్లా కాగజ్నగర్ మండలం సార్సాల అటవీ ప్రాంతంలో అటవీశాఖ అధికారులపై దాడి జరిగిన విషయం తెలిసిందే. సిర్పూర్ కాగజ్నగర్ ప్రాంతంలో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ప్రత్యామ్నాయ అటవీకరణ పనులు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దాంతో కాగజ్నగర్ అటవీ ప్రాంతంలోని సర్సాలా గ్రామంలో 20 హెక్టార్లలో చెట్లు నాటేందుకు అటవీ అధికారులు సిద్ధమయ్యారు.
చెట్లు నాటేందుకు వీలుగా భూమిని చదును చేసేందుకు ట్రాక్టర్లు, సిబ్బందితో కలిసి అధికారులు అక్కడికి చేరుకున్నారు. అయితే, ఈ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు యత్నించిన సిర్పూరు టీఆర్ఎస్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సోదరుడు, జెడ్పీ వైస్ చైర్మన్ కృష్ణ అధికారులపట్ల అమానుషంగా ప్రవర్తించడమే కాకుండా, తన అనుచరులతో కలిసి మహిళా ఎఫ్ఆర్వోపై ఒక్కసారిగా కర్రలతో దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో ఎఫ్ఆర్వో అనిత తీవ్రంగా గాయపడ్డారు. ఆ ఘటనపై సీఎం కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులైన ఎమ్మెల్యే సోదరుడు సహా 16 మందిపై కేసులు బుక్కయ్యాయి. మరోవైపు ఓ డిఎస్పీ, సీఐపై కూడా సస్పెన్షన్ వేటు పడింది.
ప్రజాప్రతినిధులే రెచ్చగొడితే ఎలా..!
ఆ ఘటన జరిగిన కొద్దిరోజులకే అటవీ భూముల వివాదంలో కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు బుక్కయ్యారు. లోతువాగు 2వ బీట్ కంపార్టుమెంట్ పరిధిలోని చాతకొండ లక్ష్మిదేవిపల్లి మండలం, ఇల్లందు క్రాస్ రోడ్స్ టూరిజం హోటల్ దగ్గర అటవీశాఖ రిజర్వ్ ఫారెస్ట్ బౌండరీ లైన్ ఉంది. దాంతో అక్కడ ఫారెస్ట్ ప్రొటెక్షన్ వాల్ నిర్మాణం చేపట్టారు అటవీశాఖ అధికారులు.
అయితే ఎమ్మెల్యే అనుచరుడిగా చలామణి అవుతున్న మాజీ ఎంపీటీసీ పూనం శ్రీను.. దాదాపు 80 మంది గ్రామస్తులను వెంటబెట్టుకుని వచ్చి అక్కడ జరుగుతున్న ఫారెస్ట్ ప్రొటెక్షన్ పనులు నిలిపివేయించారు. ఆ క్రమంలో ఎమ్మెల్యే సైతం అటవీ అధికారులకు ఫోన్ చేసి పనులు నిలిపివేయాలని బెదిరించారు. అంతేకాదు ఎవరైనా అడ్డొస్తే కర్రలతో కొట్టండంటూ గ్రామస్తులకు సూచించారు. ఈ ఘటన కూడా అప్పట్లో దుమారం రేపింది. అటవీ అధికారులపై దాడులు చేయాలంటూ సాక్షాత్తు ప్రజాప్రతినిధులు ఇలా ప్రజలను రెచ్చగొడితే ఎలా అని పలువురు ప్రశ్నిస్తున్నారు.