120ఏళ్ల రికార్డ్ బ్రేక్: ఆదిలాబాద్లో 3.8డిగ్రీలు, మరింత తగ్గే అవకాశం
హైదరాబాద్/ఆదిలాబాద్: చలి తెలంగాణ ప్రజలను వణికిస్తోంది. జిల్లాలోని ప్రజలు సాయంత్రం 6గంటల నుంచి ఉదయం 8గంటల వరకు చలి ప్రభావంతో ప్రజలకు ఎక్కువగా ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఉత్తర భారతం నుంచి వీస్తున్న శీతల గాలుల కారణంగా రాత్రిపూట ఉష్ణోగ్రతలు బాగా పడిపోతున్నాయి.
మంగళవారం తెల్లవారుజామున ఆదిలాబాద్లో అత్యల్పంగా 3.8, మెదక్లో 8, భద్రాచలం, రామగుండంలో 12, హైదరాబాద్లో 13 డిగ్రీల ఉష్ణోగ్రత(రామచంద్రాపురంలో రికార్డ్ స్థాయిలో 8.7డిగ్రీల ఉష్ణోగ్రత, మౌలాలిలో 9.2, కాప్రాలో 9.5, రాజేంద్రనగర్లో 9.6డిగ్రీలు) నమోదైంది.
120ఏళ్ళ రికార్డు బ్రేక్
తెలంగాణ రాష్ట్ర, జిల్లాల చరిత్రలో గత 120 ఏళ్లలో ఎన్నడూలేని స్థాయిలో అతితక్కువగా 3.8 డిగ్రీల ఉష్ణోగ్రత ఆదిలాబాద్లో మంగళవారం నమోదైంది. ఇది మరింత పడిపోయే సూచనలున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. తెలంగాణలో తొలి రికార్డు నిజామాబాద్లో 1897 డిసెంబరు 17 రాత్రి అత్యల్పంగా 4.4డిగ్రీల ఉష్ణోగ్రత నమోదుకాగా, తర్వాత అంత తక్కువగా 2014 డిసెంబరు 20న ఆదిలాబాద్లో 3.9 డిగ్రీలు నమోదైందని వాతావరణ శాఖ పేర్కొంది. మంగళవారం ఈ రికార్డులన్నీ పటాపంచలయ్యాయి.
తెలంగాణ మొత్తం చల్లగానే..
మెదక్లోనూ గత పదేళ్లలో అత్యల్పంగా 2010 డిసెంబరు 22న 7.5డిగ్రీల ఉష్ణోగ్రత నమోదుకాగా, మంగళవారం ఉదయం దీనికి చేరువగా 8డిగ్రీలు నమోదైంది. ఇది రెండు, మూడు రోజుల్లో మరింత తగ్గేలా ఉంది. మధ్యభారతం నుంచి తెలంగాణ సరిహద్దుల వరకు అధిక పీడనం ఏర్పడినందున, తెలంగాణలోకి ఉత్తరం నుంచి అధికంగా చల్లగాలులు వీస్తున్నాయి.
మరింత తగ్గే అవకాశం.. జాగ్రత్తలు
బుధ,గురువారాల్లో రాత్రిపూట మరింత ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సంచాలకురాలు నాగరత్న చెప్పారు. చలి బారినపడకుండా అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా వృద్ధులు, రోగులు, పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. రాత్రి పూట బయట తిరగొద్దని సూచించారు.
ప్రత్యేక వాతావరణ పరిస్థితులు
డిసెంబర్ 25నాటికి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయి. దాని ప్రభావం తెలంగాణపై పెద్దగా ఉండే అవకాశాల్లేవు. అది ఏర్పడిన తరవాత పయనదిశ, తీవ్రతను బట్టి ప్రభావాన్ని ప్రకటిస్తారు. గత వేసవి నుంచి వాతావరణంలో అనూహ్యంగా మార్పులు వస్తున్నాయి. అత్యల్ప ఉష్ణోగ్రత రికార్డులు నమోదు కావడం ఈ ఏడాది ప్రత్యేకతగా వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
లంబసింగిలోనూ..
కాగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖ మన్యాన్ని కూడా ఎప్పట్లాగే చలి వణికిస్తోంది. మంగళవారం ఉదయం లంబసింగిలో 3డిగ్రీలు, చింతపల్లిలో 4 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఏపీలో ప్రతియేటా లంబసింగిలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్న విషయం తెలిసిందే.