చలి పంజా: ఆదిలాబాద్లో మంచు దుప్పటి, 6.8 డిగ్రీల ఉష్ణోగ్రత.. హైదరాబాద్లో కూడా..
వామ్మో.. చలి చంపేస్తోంది. ఉదయం 9 గంటల వరకు చలి ప్రభావం ఉంటోంది. మధ్యాహ్నం ఇంట్లో ఉన్నా చలి తగ్గడం లేదు. ఇక సాయంత్రం 5 దాటితే గగనమే. చలి వీయడంతో జనం వణికిపోతున్నారు. అత్యవసర సమయాల్లోనే బయటకు వస్తున్నారు. ఇక టూ వీలర్పై వెళ్లారో అంతే సంగతులు. చలికి గడ్డకట్టినంత పని అయిపోతోంది. తెలంగాణలో ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నాయి. ఏజెన్సీ ప్రాంతం ఆదిలాబాద్లో కనిష్టంగా 6.8 డిగ్రీలకు ఉష్ణోగ్రత పడిపోయింది. దీంతో ఉమ్మడి జిల్లా వాసులు గజగజ వణుకుతున్నారు. వామ్మో చలి చంపేస్తోంది అంటున్నారు.
లో టెంపరేచర్..
ఆదివారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఈ సీజన్లోనే లో టెంపరేచర్ నమోదయ్యింది. ఆదిలాబాద్ జిల్లాలోని భీమ్పూర్ మండలం, ఆసిఫాబాద్ తిర్యానీ మండలంలోని గిన్నెధారిలో 6.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యిందని తెలంగాణ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ తెలిపింది. ఆదిలాబాద్ జిల్లాలో గల బేలా మండల కేంద్రం, తాంసీ మండలంలో 7.2, 7.3.. ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ మండలంలో 7.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది.
స్వెటర్లు ధరించి..
జైనద్, ఆదిలాబాద్ అర్బన్, తలమడుగు, కెరమేరీ, వాంకిడి, తిర్యానీలో 8.4 నుంచి 9.7 డిగ్రీల ఉష్ణోగ్రత వచ్చింది. పల్లెల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు తక్కువగా వస్తున్నాయి. దీంతో చిన్నపిల్లలు, వృద్దులు ఇబ్బంది పడుతున్నారు. దీంతోవారు స్వెటర్లు ధరించి.. రగ్గులతో ఉంటున్నారు. కొందరు చలికి మంటకాస్తున్నారు. ఏజెన్సీ, మారమూల ప్రాంతాల్లో చలి కాస్త ఎక్కువగానే ఉంది.
హైదరాబాద్లో కూడా..
ఇటు హైదరాబాద్లో 14 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. సిటీలో కూడా టెంపరేచర్ పడిపోవడంతో భాగ్యనగర వాసులు ఇబ్బంది పడ్డారు. రాష్ట్రంలోని చాలా చోట్ల ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. దీంతో జనం వామ్మో చలి అని అంటున్నారు. తమ ముఖ్యమైన పనులను మధ్యాహ్నాం సమయంలోనే పూర్తి చేసుకుంటున్నారు. ఉదయం, సాయంత్రం వరకు ఇంట్లోనే ఉండేందుకు ప్రయత్నం చేస్తున్నారు.