హరీష్కు మహేష్బాబుతో పోలిక, రష్మిత ప్రమాదం ట్వీట్పై ని.ల్లో కేటీఆర్
రాజకీయాల్లో నిత్యం బిజీగా ఉంటూ, ఎప్పుడూ వైట్ అండ్ వైట్ దుస్తుల్లో కనిపించే మంత్రి హరీష్ రావు టీ షర్ట్లో అచ్చం సూపర్ స్టార్ మహేష్ బాబులా ఉన్నారని జబర్దస్త్ షో కమేడియన్ అదిరే అభి అన్నారు.
సిద్దిపేట/హైదరాబాద్: రాజకీయాల్లో నిత్యం బిజీగా ఉంటూ, ఎప్పుడూ వైట్ అండ్ వైట్ దుస్తుల్లో కనిపించే మంత్రి హరీష్ రావు టీ షర్ట్లో అచ్చం సూపర్ స్టార్ మహేష్ బాబులా ఉన్నారని జబర్దస్త్ షో కమేడియన్ అదిరే అభి అన్నారు.
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం, మంత్రి హరీష్ జన్మదినాలను పురస్కరించుకుని శనివారం రాత్రి సిద్ధిపేటలోని కోమటి చెరువు వద్ద తెలంగాణ సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా అదిరే అభి మాట్లాడారు.
కట్టిపడేసిన అదిరే అభి బృందం ప్రదర్శన
హరీష్ రావుపై ఆయన ప్రశంసలు కురిపించారు. గతంలో ఉన్న సిద్ధిపేటకు, ఇప్పుడున్న సిద్ధిపేటకు ఎంతో తేడా ఉందన్నారు. హరీష్ రావు నేతృత్వంలో సిద్ధిపేట హైదరాబాదులా మారిందన్నారు. వేడుకల సందర్భంగా అదిరే అభి బృందం ప్రదర్శన కట్టిపడేసింది.
సాంస్కృతిక సారథి, మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆధ్వర్యంలో కళాకారులు ఆటాపాటలతో హోరెత్తించారు. తెలంగాణ పాటలతో పాటు ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు కళ్లకు కట్టేలా ప్రదర్శన ఇచ్చారు.
హారతి పట్టిన సిద్దిపేట
గాయకుడు, సీఎం కార్యాలయ ఓఎస్డీ దేశపతి శ్రీను తెలంగాణ పాటలతో హోరెత్తించారు. మిమిక్రీ కళాకారుడు, హాస్య నటుడు శివారెడ్డి ప్రజలను నవ్వుల్లో ముంచెత్తారు. వీ6 ఫేమ్ బిత్తిరి సత్తి, సావిత్రి ఆహుతులను అలరించారు. ఆదిలాబాద్ జిల్లా కళాకారుల జానపద నృత్యం ఆకట్టుకుంది.
మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ... రసమయి అద్భుతంగా కార్యక్రమం నిర్వహించారన్నారు. తెలంగాణ ఉద్యమానికి సిద్దిపేట హారతి పట్టిందని, ఉద్యమానికి దిక్సూచిలా నిలబడిందన్నారు. అభివృద్ధిలోనూ అలాగే ఉందన్నారు. వీ6 ఫేమ్ బిత్తిరి సత్తి, సావిత్రి సిద్దిపేట పట్టణం, మండలంలోని ఇబ్రహీంపూర్, జిల్లా గొప్పతనాన్ని వివరించారు. మరోవైపు గద్దర్లా పాటపాడిన సత్తి అదరగొట్టారు.
నిమిషాల్లో ఆదుకున్న కేటీఆర్
తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తన మానవత్వాన్ని చాటుకున్నారు. బస్సు నుంచి జారిపడి తీవ్ర గాయాలపాలైన 19 ఏళ్ల ఒడిశా యువతిని నిమిషాల్లో ఆదుకున్నారు. అర్ధగంటలోనే ఆమె శస్త్రచికిత్సకు సాయం అందించారు. రష్మిత అనే యువతి ఒడిశా నుంచి వచ్చి హైదరాబాద్లోని కాల్ హెల్త్ అనే సంస్థలో పని చేస్తున్నారు.
ఒడిశా ప్రభుత్వం స్పందించలేదు కానీ..
జీడిమెట్ల ప్రాంతంలో రష్మిత శనివారం ఉదయం బస్సులోంచి జారి పడి ప్రమాదానికి గురయ్యారు. వెంటనే ఆమెను మల్లారెడ్డి ఆసుపత్రికి తరలించారు. ఆపరేషన్ కోసం రూ.7 లక్షల వరకు ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పారు. ఆమెకు, ఆమె కుటుంబానికి అంత స్తోమత లేకపోవడంతో రాబిన్ అనే సహోద్యోగి ట్విటర్లో ఈ సమాచారాన్ని కేటీఆర్కు, ఒడిశా ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపించారు. ఒడిశా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు.
కేటీఆర్కు లక్షల నమస్కారాలు
కానీ కేటీఆర్ ఆ ట్వీట్ను చూసి స్పందించి ఆసుపత్రికి తమ సిబ్బందిని పంపించి, వెంటనే ఆపరేషన్ చేయాలని, అవసరమైన సాయాన్ని అందిస్తామని తెలిపారు. దీంతో ఆమెకు వెంటనే ఆపరేషన్ చేశారు. ట్విటర్లో సమాచారం పంపించిన రాబిన్.. కేటీఆర్కు లక్షల నమస్కారాలు అంటూ థ్యాంక్స్ చెప్పారు. కేటీఆర్ ఎంతో అంకితభావం గల నాయకుడని కాల్ హెల్త్ మానవ వనరుల మేనేజర్ శ్యాంసన్ పేర్కొన్నారు. మానవతా హృదయంతో ఆ యువతిని ఆదుకున్నారన్నారు.