మోదీ డైరెక్షన్..! కేసీఆర్ యాక్షన్..!! సెప్టెంబర్ 2న గులాబీ బాస్ ఏం చెప్పబోతున్నారు..??
తెలంగాణ భవన్ లో జరిగిన ముఖ్యనేతల విస్త్రుత స్థాయి సమావేశం రాజకీయ సంచలనాలతో ముగిసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ హంగు ఆర్బాటం లేకుండా చాలా సాదా సీదాగా రాబోవు ఎన్నికల గురించి స్పష్టత ఇచ్చేసారు. ప్రధాని మోదీ తో జరిపిన చర్చల సారాశం అనుగుణంగానే కేసీఆర్ అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా మూడు అంశాల పట్ల కేసీఆర్ స్పష్టత ఇచ్చినట్టు అర్థమవుతోంది. తెలంగాణాలో మొదట శాసన సభ, తర్వాత పార్లమెంట్ ఎన్నికలు జరుగుతాయని చెప్పడం., ఆఘమేఘాల మీద ప్రగతి నివేదన పేరుతో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేయడం., గడువు కంటే ఆరు నెలల ముందు జరిగే ఎన్నికలను ముందస్తు ఎన్నికలుగా పరిగణించలేమని చెప్పడంతో పాటు ఒంటరిగా బరిలో దిగుతామని ధీమా వ్యక్తం చేయడం. కేసీఆర్ ఈ మూడు అంశాల పట్ల కుండబద్దలు కొట్టినట్టు చెప్పడం వెనక అసలు మర్మం ఏంటి..? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..!!
కేంద్ర నిర్ణయానికి కట్టుబడి ఉంటాం..! డిసెంబర్ లోనే ఎన్నికలకు వెళ్తాం..!!
కేసీఆర్ ఢిల్లీ లో ప్రధాని తో జరిపిన చర్చల సారాంశాన్ని తెలంగాణ భవన్ లో ప్రతిబింబింపజేసారు. తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా తాము సిద్దంగా ఉన్నామనే సంకేతం ఇవ్వడంతోపాటు ముందస్తుగా శాసన సభకు ఎన్నికలు జరిగితే టీఆర్ఎస్ పార్టీకి మరింత ఉపయుక్తంగా ఉంటుందనే అంశాన్ని ప్రధాని మోదీకి వివరించడంతో పాటు, ప్రభుత్వ పూర్తి సహాకారం కేంద్రానికి ఉంటుందని హామీకూడా ఇచ్చినట్టు స్పష్టంగా తెలుస్తోంది. ముందుగా శాసన సభకు ఎన్నికలు జరిగితే తెలంగాణలో కీలకంగా ఉన్న ముస్లిం ఓటు బ్యాంకు కూడా అదికార టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉంటుందనేది కేసీఆర్ వ్యూహంగా తెలుస్తోంది. అందులో భాగంగానే నాలుగు రాష్టాలతో పాటే తెలంగాణ శాసనసభకు ఎన్నికలు జరపాలని భావిస్తున్నారు.
మైనారిటీ ఓటు బ్యాంకు మాదే..! 100 సీట్లూ మాకే..!!
డిశెంబర్ లో ఎన్నిలకలకు ఉబలాటపడుతున్న కేసీఆర్ మరో మాస్టర్ ప్లాన్ కు శ్రీకారం చుట్టబోతున్నారు. తెలంగాణాలో ఏ పార్టీ కూడా ఎన్నికలకు పూర్తి స్థాయిలో సంసిద్దం కాలేదు కాబట్టి ముందస్తు ఎన్నికలు టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా మారే అవకాశాలు ఉన్నాయనేది ఆయన భావన. అందుకోసం శర వేగంగా పావులు కదుపుతున్నారు కేసీఆర్. కాంగ్రెస్ పార్టీ అంతర్గత కుమ్ములాటలతో ఉందని, తెలుగుదేశం పార్టీ బలహీనపడిందని, జనసమితి కోదండరాం ఇప్పుడే ప్రజాబాట పట్టారని., బీజేపి తన ఐదు సీట్లు కాపాడుకునేందుకే కసరత్తు చేస్తుంది తప్ప మిగతా నియోజక వర్గాల్లో పోటీ ఇచ్చేందుకు కాదని., ఇవన్ని టీఆర్ఎస్ పార్టీకి కలిసొచ్చే అంశాలను చంద్రశేఖర్ రావు భావిస్తున్నారు. కేంద్రంతో బీజెపి తో దోస్తీ కడుతున్నప్పటికి స్థానికంగా ఆ ప్రభావం ముస్లిం ఓటు బ్యాంకు పైన పడకుండా ఉండేందుకు కేసీఆర్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది.
సెప్టెంబర్ రెండునే ఎన్నికల శంఖారావం..! భారీ జన సమీకరణకు ప్లాన్..!!
అంతే కాకుండా సెప్టెంబర్ రెండో తారీఖున ప్రగతి నివేదన సభ నిర్వహించి పార్టీ ఎజెండా ఏంటో ప్రజలకు వివరిస్తామని కేసీఆర్ పేర్కొన్నారు. ఆఘమేఘాల మీద నివేదన్ సభ ఆవశ్యకత కూడా ముందస్తు ప్రణాళికలో బాగంగా నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. గులాబీ ప్రభుత్వం నాలుగేళ్లుగా తెలంగాణ ప్రజానికానికి ఏం చేసిందనే అంశాలను వివరించేందుకు భారీ ఎత్తున సభ నిర్వహించాలను భావిస్తున్నారు. పంద్రాగస్టు రోజున ప్రభుత్వ విధానాలను ప్రజలకు వివరించడం తో పాటు సెప్టెంబర్ రెండున పార్టీ లైన్ ను వివరిస్తామని, ఆరు నెలల ముందుగానే ఎన్నికలకు ఎందుకు వెళ్లాల్సి వస్తుందో ప్రజలకు వివరించేందుకు సమాయత్తం అవుతున్నారు కేసీఆర్. హైదరాబాద్, రంగారెడ్డి పరిసర ప్రాంతాల్లో సుమారు 1500 ఎకరాల్లో నిర్వహించబోయే భారీ బహిరంగ సభ తెలంగాణ ముందస్తు ఎన్నికల శంఖారావంగా మారబోతుందనే చర్చకూడా జరుగుతోంది.
పొత్తులు లెవ్..!గిత్తుల్ లెవ్..! మాకు మేమే చూసుకుంటం..!!
తెలంగాణలో ఏ పార్టీతో పొత్తులుండవని చంద్రశేఖర్ రావు తేల్చి చెప్పేసారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా 100 సీట్లలో గెలుస్తామని ధీమా కూడా వ్యక్తం చేస్తున్నారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే సెప్టెంబర్ లో శాసన సభను రద్దు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సిట్టింగ్ స్థానాలలో మార్పులు ఉంటాయని చంద్రశేఖర్ రావు చెప్పుకొస్తున్నారు. దీంతో ఎవరి సీట్లు ఉంటాయో ఎవరి సీట్లు ఊడతాయోననే అయోమయంలో ఉన్నారు కొందరు ఎమ్మెల్యేలు. తెలంగాణలో ముందస్తు ఎన్నికల రాగం ఎప్పటినుండో వినిపిస్తున్నా ఇంత అకస్మాత్తుగా కేసీఆర్ నిర్ణయం తీసుకోవడం సంచలనంగా మారింది. గత వారం మోదీ తో జరిపిన చర్చల సారంశం ప్రకారమే తెలంగాణలో ముందస్తు ఎన్నికల ప్రకటన చేసారని చర్చ జరుగుతోంది. మొత్తానికి ప్రదాని మోదీ డైరెక్షన్, తెలంగాణలో కేసీఆర్ యాక్షన్ ప్రజాక్షేత్రంలో ఎంతవరకు రక్తి కడుతుందో చూడాలి.