‘శాస్త్ర విజ్ఞానం జీవితానికి అనుసంధానించాలి’: ఫిల్మ్సిటీలో ఏరోస్పేస్ మ్యూజియం(ఫొటోలు)
హైదరాబాద్: శాస్త్ర విజ్ఞానాన్ని మానవ జీవితానికి అనుసంధానం చేయాల్సిన అవసరం ఉందని, ఆ దిశగా సామాజిక శాస్త్రవేత్తలు కృషి చేయాలని తెలంగాణ ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ, ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు.
నగర శివారులోని రామోజీ ఫిల్మ్ సిటీలో శుక్రవారం ఏరోస్పేస్ సొసైటీ ఆఫ్ ఇండియా, యుసృష్టి ఏరోస్పెస్ పార్క్ల ఆధ్వర్యంలో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఏరోస్పేస్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్(హైదరాబాద్)తో కలిసి జాతీయ ఏరోస్పేస్ మ్యూజియంను ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ మ్యూజియాన్ని మహమూద్ అలీ, ఈటెల రాజేందర్ తోపాటు రామోజీ గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు ప్రారంభించారు. ప్రదర్శన నవంబర్ 29 వరకు కొనసాగనుంది. ఈ సందర్భంగా వాయుసృష్టి ఏరోపార్క్ త్రీడీ వీడియోను, ఏరోస్పేస్ సొసైటీ లోగోను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మహమూద్ అలీ మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు సిఎం కెసిఆర్ కృషి చేస్తున్నారని అన్నారు. శాస్త్ర సాంకేతిక రంగంలోనూ ప్రగతి సాధించే దిశలో ఆయా సంస్థలకు అవసరమైన తోడ్పాటును అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఏరోస్పేస్ వంటి సంస్థలు రాష్ట్రానికి రావడం అభినందనీయమని చెప్పారు.
బాల్యదశలోనే పిల్లలకు ఆసక్తి కలిగిన రంగంలో శిక్షణ అందిస్తే వారు అద్భుతాలు సృష్టిస్తారని చెప్పారు. ఆర్థిక మంత్రి ఈటెల మాట్లాడుతూ.. శాస్త్ర విజ్ఞానం మానవ కళ్యాణానికి దోహదపడాలని అన్నారు. తరుగుతున్న ఇంధన, సంపద వనరులపై సామాజిక శాస్త్రవేత్తలు దృష్టిసారించాలని సూచించారు.