కరోనా అతనికి మంచి చేసింది... 33ఏళ్లుగా సాధ్యం కాని దాన్ని నెరవేర్చింది...
పదో తరగతి పాస్ అవాలన్నది ఆయన కల. కానీ ఎప్పుడూ దురుదృష్టం వెక్కిరించేది. అలా ఒకటి కాదు,రెండు కాదు ఏకంగా 33 సార్లు పరీక్షలు రాసి ఫెయిల్ అయ్యాడు. ఇక జీవితంలో పదో తరగతి పాస్ అవుతానో లేదోనన్న పరిస్థితుల్లో కరోనా పుణ్యమాన్ని ఎట్టకేలకు పది గట్టెక్కేశాడు.
వివరాల్లోకి వెళ్తే... హైదరాబాద్లోని భోలక్పూర్కి చెందిన మహమ్మద్ నూరుద్దీన్(51) అంజుమన్ బాయ్స్ హైస్కూల్లో వాచ్మెన్గా పనిచేస్తున్నాడు. నిజానికి పదో తరగతి పాసై ప్రభుత్వం ఉద్యోగం సాధించాలన్నది ఆయన కల. కానీ 1987 నుంచి ఇప్పటివరకూ 33 సార్లు పరీక్షలు రాసినా పాస్ కాలేకపోయాడు. దీంతో పాస్ అవుతానన్న నమ్మకం కూడా పోయింది. ఇలాంటి తరుణంలో అనూహ్యంగా కరోనా విజృంభించడం,పరీక్షలు నిర్వహించలేని పరిస్థితులు నెలకొనడం నూరుద్దీన్కు కలిసొచ్చింది.
పరీక్షలకు అప్లై చేసుకున్న విద్యార్థులందరినీ ప్రభుత్వం పాస్ చేస్తూ నిర్ణయం తీసుకోవడంతో నూరుద్దీన్ కూడా ఎట్టకేలకు పది పాసయ్యాడు. దీనిపై ఆయన మాట్లాడుతూ... 'పోలీస్ శాఖ లేదా రక్షణ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకునేవాడిని. ప్రభుత్వ ఉద్యోగులకు మంచి జీతం,సదుపాయాలు ఉంటాయి కాబట్టి ఆ కోరిక ఉండేది. అయితే ఎన్నిసార్లు పదో తరగతి పరీక్షలు రాసినా పాస్ కాలేకపోయాను. 33 సార్లు ఫెయిల్ అయినప్పటికీ... విసుగు చెందకుండా మళ్లీ మళ్లీ రాస్తూనే ఉన్నాను. ఇప్పుడు ఎట్టకేలకు కరోనా వల్ల పాస్ అయిపోయాను.' అని చెప్పాడు.
Recommended Video
వయసు రీత్యా ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలకు అవకాశం కోల్పోయినప్పటికీ... వయసుతో నిమిత్తం లేని గ్రూప్ డీ జాబ్స్కి అప్లై చేసుకుంటానని నూరుద్దీన్ చెబుతున్నాడు. లేదా కాంట్రాక్ట్ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తానంటున్నాడు. నూరుద్దీన్కు నలుగురు పిల్లలు కాగా... కుమార్తె బీకాం పూర్తి చేసింది. ఇద్దరు కొడులు ఇంటర్ పూర్తి చేసినట్లు సమాచారం. నూరుద్దీన్ పది పాసవడం పట్ల 90ఏళ్ల ఆయన తండ్రి సంతోషం వ్యక్తం చేశాడు.