కవితకు ఏపీ యువకుల రాఖీ.. ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనన్న ఎంపీ
నందిగామ : రక్షాబంధన్ అన్నా-చెల్లెళ్ల బంధంగానే కాదు, తెలుగు రాష్ట్రాల మధ్య అనుబంధానికీ ప్రతీకగా నిలుస్తోంది. తెలంగాణ-ఆంధ్రా రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత తొలిసారిగా ఆంధ్రాలో అడుగుపెట్టిన తెలంగాణ ఎంపీ కవిత అక్కడి ప్రజల అభిమానాన్ని చూరగొన్నారు.
ప్రస్తుత తెలంగాణ సీఎం కేసీఆర్ మంత్రిగా ఉన్న కాలంలో.. ఆయన కార్యదర్శిగా పనిచేసిన కృష్ణమూర్తి కుమార్తెతో వినుతతో కవితకు మంచి స్నేహం ఉండేది. విభజన నేపథ్యం వాళ్లిద్దరి స్నేహానికి అడ్డురాలేదు సరికదా.. ఇప్పటికీ ఇద్దరి మధ్య స్నేహా సంబంధాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే కృష్ణా జిల్లా నందిగామలో జరిగిన వినుత అన్నయ్య కూతురు ఓణీల ఫంక్షన్ కు హాజరయ్యారు ఎంపీ కవిత.
ఈ సందర్బంగా.. మీడియాతో మాట్లాడిన కవిత.. ప్రాంతాలు వేరయినా మనుషులుగా ఎప్పుడూ ఒకటిగానే ఉన్నామన్నారు. తెలంగాణ ఆంధ్రా అన్న తేడా లేకుండా.. ఏ ప్రాంతం నుంచి వచ్చే భక్తులకైనా సమాన గౌరవం దక్కుతోందన్నారు. ఇదే సందర్బంగా ఎంపీ కవితకు కొంతమంది ఆంధ్రా యువకులు రాఖీలు కట్టి స్వీట్లు తినిపించడం విశేషం.
తెలంగాణ ఆంధ్రా ప్రజలంతా సోదరభావంతో మెలగాలని కవిత సూచించడంతో.. ఖమ్మం కృష్ణా జిల్లాల్లా కలిసిమెలిసి ఉంటామన్నారు అక్కడున్న యువకులు. దీంతో ఒక్కసారిగా అందరిలో నవ్వులు విరబూసాయి. ప్రతీ ఒక్కరిని సోదరుడంటూ ఆప్యాయంగా పలకరించిన కవిత.. అక్కడి యువతను ఆకట్టుకున్నారు. ఇదిలా ఉంటే తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా వినుత అన్నయ్యకు క్లాస్ మేట్ కావడం గమనార్హం.
ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే :
కేసీఆర్ కార్యదర్శిగా పనిచేసిన కృష్ణమూర్తి ఇంట్లో జరిగిన ఫంక్షన్ కు హాజరైన ఎంపీ కవిత.. ఏపీకి ప్రత్యేక హోదాపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా అనేది పార్లమెంటు సాక్షిగా ఏపీకి లభించిన హామి అన్నారు కవిత. కాంగ్రెస్ హయాంలో నాటి ప్రధాని మన్మోహన్ ఇచ్చిన హామిని నెరవేర్చాల్సిన బాధ్యత ప్రస్తుతం కేంద్రంలో ఉన్న ప్రభుత్వంపై ఉందని గుర్తు చేశారు.
హోదా అంశంలో ఏపీకి తెలంగాణ మద్దతు ఉంటుందని తెలిపిన కవిత.. ప్రత్యేక హోదాకు సాంకేతిక కారణాలు అడ్డు వస్తే రాజకీయ పరంగానైనా నిర్ణయం తీసుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.