తెలంగాణ ప్రభుత్వం విజ్ఞతకే వదిలేస్తున్నా, త్వరలో దానిపై కార్యాచరణ: స్వామి
కాకినాడ: తనపై ఆరు నెలల బహిష్కరణ వేటును తెలంగాణ ప్రభుత్వ విజ్ఞతకే వదిలేస్తున్నానని శ్రీపీఠం పరిపూర్ణానంద స్వామి గురువారం అన్నారు. కాకినాడ శివార్లలోని సర్పవరం జంక్షన్ వద్ద తన ఆశ్రమంలో మీడియాతో మాట్లాడారు.
Recommended Video
పాత ప్రసంగం! పరిపూర్ణానందస్వామి నగర బహిష్కరణ: 'ఇదో బ్లాక్ డే'
శ్రీ వెంకటేశ్వరస్వామి, సుప్రభాతం తదితరాలపై బాబు గోగినేని అనుచిత వ్యాఖ్యలు చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం మహేష్ కత్తిని మాత్రమే బహిష్కరించడం సరికాదన్నారు. చాలామంది మహేష్ కత్తి బహిష్కరణ మాత్రమే శిక్ష కాదని, ఆయనను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తోన్న విషయం తెలిసిందే. పరిపూర్ణానంద కూడా ఇతరులను వదిలి కేవలం ఆయననే బహిష్కరించారనే అర్థంలో మాట్లాడారు.
సంఘ విద్రోహ శక్తిగా పేర్కొంటూ తనను బహిష్కరించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. 300 గ్రామాలను దత్తత తీసుకుని, వెనుకబడ్డ ప్రాంతాల్లోని పిల్లలకు దేశభక్తిని బోధిస్తున్నానని, వందల ఆవులను, ఎద్దులను రైతులకు దానం చేశానని చెప్పారు. అందుకు ప్రతిగా తనను విద్రోహశక్తిగా ముద్ర వేశారన్నారు.
అనుచిత వ్యాఖ్యలకు దారితీసిన పరిస్థితులను గుర్తించాలని తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇలాంటి చర్యలతో తన ధర్మపోరాటం ఆగదని తేల్చి చెప్పారు. దేశంలో ఉన్న మిగతా రాష్ట్రాల్లో హిందూ ధర్మపరిరక్షణ కోసం పాటుపడతానని తెలిపారు. హిందూమతంపై అనుచిత వ్యాఖ్యలు, దూషిస్తూ పుస్తకాలు రాసిన వారిపై తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం శోచనీయమన్నారు.
తన జీవితం హిందూధర్మ పరిరక్షణకే అంకితమని, ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా వెనక్కి తగ్గేది లేదన్నారు. హిందూధర్మంపై దాడి చేస్తున్న వారిపై ప్రభుత్వం ఎందుకు కఠిన చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఇతర మతాలకు చెందిన విశ్వాసాల జోలికి రాకుండా చట్టాలను కట్టుదిట్టం చేయాలని డిమాండ్ చేశారు. త్వరలో కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పారు.
మరో రెండు కమిషనరేట్లు, ఎందుకు చర్యలు తీసుకోరాదు
పరిపూర్ణానందస్వామికి సైబరాబాద్, రాచకొండ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఆయన ఇటీవలి ప్రసంగాలు, వ్యాఖ్యలు విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉన్నందున ఆయా కమిషనరేట్ల పరిధిలోనికి ప్రవేశించకుండా ఎందుకు చర్యలు తీసుకోరాదో తెలపాలని పేర్కొన్నారు. 48 గంటల్లోగా సమాధానమివ్వాలని కోరారు. చౌటుప్పల్ నుంచి యాదాద్రికి ధర్మాగ్రహయాత్ర చేపట్టనున్న నేపథ్యంలో పరిపూర్ణానంద స్వామిని రెండు రోజుల క్రితం జూబ్లీహిల్స్ రోడ్నం.74లోని ఆయన స్నేహితుడి నివాసంలో హైదరాబాద్ పోలీసులు హౌస్ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
హైకోర్టులో బహిష్కరణ అంసం
పరిపూర్ణానంద స్వామి నగర బహిష్కరణపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఓ లాయర్ గురువారం హైకోర్టులో ధర్మాసనం ఎదుట ప్రస్తావించారు. పోలీసుల తీరుపై అభ్యంతరం ఉంటే వ్యాజ్యం వేసుకోవచ్చునని చీఫ్ జస్టిస్ టీబీఎన్ రాధాకృష్ణన్, జస్టిస్ రమేశ్ రంగనాథన్తో కూడిన ధర్మాసనం పేర్కొంది.