కవిత తప్ప ఎవరూ కనిపించలేదా?: జోగిని శ్యామల కంటతడి, శాపనార్థాలపై ఆకుల విజయ
Recommended Video
హైదరాబాద్: జోగిని శ్యామల కంటతడి, ప్రభుత్వంపై శాపనార్థాలు పెట్టిన అంశంపై బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు ఆకుల విజయ మంగళవారం స్పందించారు. తెలంగాణ జనాభాలో సగభాగం ఉన్న మహిళల ఓట్లతో గద్దెను ఎక్కిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు వారి సమస్యలను ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు.
కుప్పకూలుతుంది: తెలంగాణ సర్కారుపై శ్యామల శాపనార్థాలు, అండగా వీహెచ్, తలసాని వివరణ
మహిళలు కంటతడి పెట్టారు
బంగారు తెలంగాణలో సగభాగం అయిన మహిళలతో కన్నీళ్లు పెట్టిస్తున్న ఘనత ముఖ్యమంత్రిదే అన్నారు. ఆదివారం జరిగిన బోనాల వేడుకలో కూడా మహిళలు కంటతడి పెట్టారన్నారు. మేం మాట్లాడితే రాజకీయాలు అంటారని, మరి భవిష్యవాణి చెప్పిన అమ్మవారే స్వయంగా మహిళల విషయంలో బాధపడ్డారని గుర్తు చేశారు.
జోగిని శ్యామల కూడా కంటతడి పెట్టారు
అమ్మవారు చెప్పిన విషయాన్ని రాష్ట్రం మొత్తం టీవీ ఛానళ్లలో చూసిందని ఆకుల విజయ అన్నారు. ఉజ్జయని అమ్మవారికి ప్రభుత్వం బంగారు బోనం సమర్పించినా మహిళల్లో ఆనందం లేకుండా పోయిందన్నారు. పోలీసులు ప్రవర్తించిన తీరుతో జోగిని శ్యామల కంటతడి పెట్టుకున్నారని వాపోయారు.
కవిత తప్ప తెలంగాణలో మరో మహిళ కనిపించలేదా?
బంగారు బతుకమ్మతో పాటు బంగారు బోనం కూడా కేసీఆర్ కూతురు, నిజామాబాద్ ఎంపీ కవితదే అయిందని ఆకుల విజయ విమర్శించారు. రాష్ట్రంలో కవిత తప్ప మరో మహిళ కేసీఆర్కు కనిపించడం లేదన్నారు. ఉజ్జయిని అమ్మవారికి సమర్పించిన బంగారు బోనం కవిత ఎత్తుకున్నదని, ఏ అర్హతతో ఎత్తుకున్నదో చెప్పాలన్నారు. కేసీఆర్ సతీమణికి బోనం ఇస్తే తమకు ఎలాంటి అభ్యంతరం ఉండేది కాదన్నారు.
భవిష్యవాణి చెప్పే వారు కూడా ఇబ్బందిపడ్డారు
ప్రభుత్వం తీరుతో భవిష్యవాణి చెప్పే స్వర్ణలత కూడా ఇబ్బంది పడ్డారని ఆకుల విజయ ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా రిపోర్టర్లు, యాంకర్లు కూడా అక్కడ ధర్నా చేయాల్సిన పరిస్థితి దాపురించిందని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి కళ్లు తెరవాలని హితవు పలికారు.