జ్యోతిబసు తర్వాత కేసీఆరే, తెలంగాణ ప్రజల అభిమానం అలా.., వాళ్లకు పుట్టగతులుండవ్: కేటీఆర్
హైదరాబాద్ : భారత దేశ చరిత్రలో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తి జ్యోతిబసు అని, తెలంగాణ ప్రజల అభిమానం చూస్తుంటే జ్యోతిబసు రికార్డును తిరగరాసే దమ్మున్న వ్యక్తి కేసీఆరేనన్న విశ్వాసం కలుగుతోందని మంత్రి కేటీఆర్ అన్నారు.
Recommended Video
టీడీపీ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు గండ్ర సత్యనారాయణరావు, జనగామ అధ్యక్షుడు మధుసూదన్రెడ్డి, రాజన్నసిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు అన్నమనేని నరసింగరావు, హుస్నాబాద్, మంథని ఇన్చార్జులు రవీందర్రావు, కర్రు నాగయ్య తమ అనుచరులతో కలిసి బుధవారం టీఆర్ఎస్లో చేరారు.
టీడీపీ ఇక కనుమరుగు...
ఈ సందర్భంగా తెలంగాణ భవన్ వద్ద నిర్వహించిన బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో టీడీపీ పూర్తిగా తుడిచిపెట్టుకు పోయిందన్నారు. బీహార్ నుంచి విడిపోయిన జార్ఖండ్లో ఆర్జేడీ ఉనికి కోల్పోయినట్లు.. టీడీపీ కూడా కనుమరుగవుతుందని జోస్యం చెప్పారు.
అప్పట్లో ఎన్టీఆర్.. ఇప్పుడు కేసీఆర్..
కాంగ్రెస్ పాలనతో విసిగి వేసారిపోయిన ప్రజల కోసం అప్పట్లో ఎన్టీఆర్ టీడీపీని స్థాపించగా... తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్.. తెలంగాణ రాష్ట్ర సమితిని ప్రారంభించారని కేటీఆర్ గుర్తు చేశారు. అసలు తెలంగాణ ఉద్యమం జరిగిందే అస్తిత్వం కోసమని... అలాంటి చోట ఇంకా ఢిల్లీ నేతల మోచేతి నీళ్లు తాగుతున్న రాష్ట్ర కాంగ్రెస్ నాయకులకు పుట్టగతులుండబోవని ఆయన వ్యాఖ్యానించారు.
వెయ్యి ఏనుగుల బలం వచ్చినట్లు...
గండ్ర సత్యనారాయణ చేరికతో భూపాలపల్లి జిల్లాలో టీఆర్ఎస్కు వెయ్యి ఏనుగుల బలం వచ్చిందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి తగిన ప్రాధాన్యం ఉంటుందన్నారు. భేదాభిప్రాయాలు లేకుండా కార్యకర్తలందరూ కలిసికట్టుగా పనిచేసి పార్టీని మరింత బలోపేతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
తెలంగాణలో టీడీపీ దుకాణం బంద్...
డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి మాట్లాడుతూ తెలంగాణలో టీడీపీ దుకాణం బంద్ అయిందంటూ ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా టీడీపీకి రాజీనామా చేసి తాను టీఆర్ఎస్లో చేరానని గుర్తు చేశారు. అందరం కలిసి పోరాడి సాధించుకున్న తెలంగాణను అభివృద్ధి చేసుకోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వాములయ్యేందుకే వివిధ పార్టీల నేతలు టీఆర్ఎస్లో చేరుతున్నారంటూ.. ఇప్పుడు గండ్ర సత్యనారాయణ టీఆర్ఎస్లో చేరడం చాలా సంతోషంగా ఉందన్నారు.
ఆత్మహత్యలు లేని ఆకుపచ్చ రాష్ట్రంగా...
మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజల సంక్షేమాన్ని గత ప్రభుత్వాలు గాలికి వదిలేశాయని ఆరోపించారు. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ని అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్దేనన్నారు. టీఆర్ఎస్ పాలనలో ఎరువుల బస్తాల కోసం రైతులు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేయాల్సిన దుస్థితి లేకుండా పోయిందన్నారు. ఆత్మహత్యలు లేని ఆకుపచ్చ రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
కేసీఆర్ కు అండగా నిలుద్దాం...
కరీంనగర్ ఎంపీ వినోద్కుమార్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్కు అండగా నిలిచిన విధంగానే... ఇప్పుడు టీఆర్ఎస్ సర్కారుకు బాసటగా నిలవాలని ప్రజలను కోరారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎదుర్కొన్న కష్టాలను దూరం చేసేందుకు సీఎం కేసీఆర్ అహర్నిశలు శ్రమిస్తున్నారని తెలిపారు.
ఏ బాధ్యత అప్పగించినా...
ఇక టీఆర్ఎస్లో చేరిన గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగస్వామ్యం కావాలనే టీఆర్ఎస్లో చేరానని చెప్పారు. పార్టీ అప్పగించే బాధ్యత ఏదైనా సమర్థవంతంగా నిర్వర్తిస్తానన్నారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతారావు, ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డ్డి, పుట్ట మధు తదితరులు పాల్గొన్నారు.