కేసీఆర్కు వరుస పొగడ్తలు: ఇప్పుడు తమిళనాడు గవర్నర్ రోశయ్య
కరీంనగర్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య ప్రశంసలు కురిపించారు. హరితహారాన్ని కేసీఆర్ ప్రజా ఉద్యమంగా చేపడుతున్నారని రోశయ్య కితాబిచ్చారు. రాష్ట్రాన్ని పచ్చదనంగా మార్చడంలో కేసీఆర్ విరివిగా మొక్కలు నాటిస్తున్నారన్నారు.
రోశయ్య గురువారం నాడు కరీంనగర్ జిల్లాలో పర్యటించారు. ఆయన గోదావరిఖనిలో తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్తో పాటు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ఓ మొక్కను నాటారు. అనంతరం కేసీఆర్ పైన ప్రశంసలు కురిపించారు.
గతంలో గోదావరి పుష్కరాల సమయంలో విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్, మొన్నటి ఆదివారం ప్రధాని నరేంద్ర మోడీ.. ఇలా వరుసగా కేసీఆర్ పైన ప్రశంసలు కురిపిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా రోశయ్య పొగడ్తలు దక్కాయి.
కాగా రోశయ్య సింగరేణి కమ్యూనిటీ హాలులో నిర్వహించే ఆర్యవైశ్య సంఘం ఉత్తర తెలంగాణ జిల్లాల ప్రాంతీయ సదస్సుకు హాజరయ్యారు. అనంతరం ఎఫ్సీఐ ప్లాంటులో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు.