తెలంగాణా వచ్చాక బాగుపడింది కేసీఆర్ కుటుంబం మాత్రమే ... పాలమూరులో మోడీ ఫైర్
దేశవ్యాప్తంగా ఎన్నికల నేపధ్యంలో పొలిటికల్ హీట్ రాజకీయవర్గాల్లో సెగలు పుట్టిస్తోంది. ఇటు తెలంగాణ రాష్ట్రంలోనూ వార్ వన్ సైడే అని ఫీల్ అయిన టీఆర్ఎస్ పార్టీకి టెన్షన్ పట్టుకుంది. 16 స్థానాలలో విజయకేతనం ఎగురవేయాలని కంకణం కట్టుకున్న టిఆర్ఎస్ పార్టీ ప్రచార పర్వం నిర్వహిస్తోంది. అయితే లోక్ సభ ఎన్నికల రంగంలోకి దిగిన జాతీయ పార్టీలు 16 స్థానాలలో గెలుపు కెసిఆర్ కు అంత సాధ్యం కాదు అని తెగేసి చెబుతున్నాయి.
పాలమూరులో నరేంద్రమోడీ ప్రసంగం .. కేసీఆర్ యజ్ఞ యాగాలపై సెటైర్లు
అసెంబ్లీ ఎన్నికల్లోచేదు అనుభవం చవి చూసినా మళ్ళీ లోక్ సభ ఎన్నికల బరిలో అదృష్టాన్ని పరీక్షించుకున్తున్నాయి ప్రతిపక్ష పార్టీలు. ఇక ఎన్నికల ప్రచారంలో భాగంగా దూకుడు పెంచిన ప్రతిపక్ష పార్టీలు ప్రచార పర్వాన్ని హోరెత్తిస్తున్నాయి. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలోని పాలమూరులో బీజేపీ ఎన్నికల ప్రచార సభ జరిగింది. ఈ సభకు హాజరైన నరేంద్ర మోడీ తనదైన స్టైల్ లో కెసిఆర్ పై నిప్పులు చెరిగారు. ముఖ్యంగా కేసీఆర్ యజ్ఞ యాగాల నే టార్గెట్ చేస్తూ ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించారు.
ప్రభుత్వాన్ని సీఎం నడపాలా .. జ్యోతిష్యులు నడపాలా ? ప్రశ్నించిన మోడీ
తెలంగాణ ముఖ్యమంత్రికి యాగాలు చేయడానికి టైం సరిపోతుంది. ఇక పాలనని, ప్రజలను పట్టించుకునే పని లేదా అని మోడీ కేసీఆర్ ను ప్రశ్నించారు. మేలో ఎన్నికలకు పోటీ చేస్తే ఓడిపోతావని ఎవరో పంతులు చెప్పారంట, అంతే ఇక అదే భయంతో ముందస్తుకు పోయారు కెసిఆర్ అని కేసీఆర్ జాతకాల పిచ్చి పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు .
ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్న సీఎం నడపాలా? జ్యోతిష్కులు నడపాలా? అని ప్రశ్నించిన నరేంద్ర మోడీ ఇలాంటి నాయకుడు ప్రజలకు అవసరమా చెప్పండి అంటూ సంచలన వ్యాఖ్య చేశారు .
ఐదేళ్లలో చేసిందేంటీ : మోదీపై కేసీఆర్ విమర్శలు
కేసీఆర్ కుటుంబం తప్ప బాగు పడింది తెలంగాణలో ఎవరో చెప్పండి
మోడీ జాతకం బాగుంది ఆయన ధాటికి మీరు తట్టుకోలేరు. దయచేసి ముందస్తు ఎన్నికలకు పొమ్మని జ్యోతిష్కులు చెప్పారట అందుకే కేసీఆర్ విన్నారట.? అంటూ మోడీ కెసిఆర్ పై సెటైర్లు వేశారు.
తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటినుండి బాగుపడింది ఎవరు అంటూ మోడీ ప్రశ్నించారు. ఒక్క కేసీఆర్ కుటుంబం తప్ప తెలంగాణ ప్రజలకు ఎలాంటి మేలు జరగలేదని, తెలంగాణ ప్రజల కోసం కేసీఆర్ ఏం చేయలేదని ఆయన ఎద్దేవా చేశారు. రాష్ట్రం ప్రజలకు అనుగుణంగా ఉండకపోయినా పర్లేదు కానీ, కెసిఆర్ కి అనుగుణంగా ఉండాలంటే... ఇదెక్కడి న్యాయమో చెప్పాలంటూ మోడీ ప్రశ్నించారు.
పాలమూరులో మోడీ సభ ప్రభావం ఉంటుందా ?
పాలమూరులో మోడీ ప్రచార సభకు పెద్ద ఎత్తున ప్రజలు వచ్చినట్టుగా తెలుస్తుంది. పాలమూరు బరిలో బీజేపీ నుండి రంగంలోకి దిగిన జేజమ్మ డీకే అరుణ ఈ సారి ఎలాగైనా ఎన్నికల్లో విజయం సాధించాలన్న పట్టుదలతో ఉన్నారు. ఇక ఇదే సమయంలో మోడీ ఎన్నికల ప్రచార సభ పార్టీ శ్రేణుల్లో కొత్త ఊపు తెచ్చింది. ఇక ఈ సభా వేదికగా మొత్తంమీద కేసిఆర్ టార్గెట్ గా మోడీ సంధించిన వాగ్బాణాల ప్రభావం పాలమూరు లో ఏ విధంగా ఉండబోతుందో వేచి చూడాలి.