షాకింగ్: 'అంతర్యుద్ధం, టీఆర్ఎస్-కూటమికి సమాన సీట్లు వస్తే హరీష్ రావు ముఖ్యమంత్రి'
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)లో అంతర్యుద్ధం జరుగుతోందని తెలుగుదేశం పార్టీ నేత రేవూరి ప్రకాశ్ రెడ్డి సోమవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ పార్టీలో హరీష్ రావు అసలు సిసలైన రాజకీయ నాయకుడు అని ప్రశంసించారు. ఆయన ఆ పార్టీలో అసలు ఇమడలేకపోతున్నారని చెప్పారు. కేసీఆర్ అభధ్రతా భావంలో ఉన్నారని చెప్పారు. కొడుకు, కూతురులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు.
బాబూ! పిచ్చివేషాలేస్తే సంగతి చూస్తాం, కేసీఆర్ దెబ్బకు ఏపీకి, రికార్డులు తీస్తాం: హరీష్ కీలకవ్యాఖ్యలు
టీఆర్ఎస్, ప్రజాకూటమికి సమాన సీట్లు వస్తే హరీష్ రావు సీఎం
ఎప్పటికైనా టీఆర్ఎస్ చీలిపోవడం ఖాయమని చెప్పారు. టీఆర్ఎస్, ప్రజాకూటమికి సమానంగా సీట్లు వస్తే అందులో (టీఆర్ఎస్) కొందరిని తీసుకొని వచ్చి హరీష్ రావు ముఖ్యమంత్రి అవుతాడని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైయస్ రాజశేఖర రెడ్డి బతికి ఉంటే హరీష్ రావు కాంగ్రెస్ పార్టీలో చేరేవారని చెప్పారు.
అవమానం.. అంతర్యుద్ధం.. హరీష్కు అవమానం
హరీష్ రావు సరైన సమయం కోసం వేచి చూస్తున్నాడని రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ పార్టీలో అవమానం జరుగుతున్నప్పటికీ విధిలేని కారణంగానే హరీష్ అందులో కొనసాగుతున్నారని చెప్పారు. కానీ తెరాసలోని అంతర్యుద్ధం కారణంగా ఆయన ఎప్పుడైనా బయటకు రావొచ్చునని అభిప్రాయపడ్డారు.
ఇప్పటికే వంటేరు సంచలనం
గజ్వెల్ నియోజకవర్గంలో కేసీఆర్ను ఓడించాలని హరీష్ రావు తనకు ఫోన్ చేశారని, ఇందుకోసం ఎలాంటి సాయమైనా చేస్తానని చెప్పారని, తెరాసలో అంతర్గత విభేదాలు ఉన్నాయని, కేటీఆర్ను కేసీఆర్ ప్రోత్సహిస్తున్నారని, తనను రాజకీయంగా ఎదగనీయడం లేదని హరీష్ రావు వాపోయారని కాంగ్రెస్ నేత వంటేరు ప్రతాప్ రెడ్డి అంతకుముందు సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. గజ్వెల్ నియోజకవర్గంలో తనకు ఉన్న ఫాలోయింగ్ అందరికీ తెలిసిందేనని, దాంతో కేసీఆర్ను ఓడించాలని, అవసరమైతే ఆర్థిక సాయం చేస్తానని హరీష్ రావు తనకు చెప్పారని వంటేరు అన్నారు. కేసీఆర్ తన కొడుకు కేటీఆర్కు ప్రాధాన్యం ఇస్తున్నారని, ఆయన అలా ఉన్నంత కాలం తనకు రాజకీయ భవిష్యత్తు ఉండదని హరీష్ రావు తనతో చెప్పారన్నారు. కేసీఆర్ను ఓడించేందుకు ఆర్థికంగా సాయం చేస్తానని హరీష్ రావు చెబితే తాను నో చెప్పానని అన్నారు. అది పాపపు సొమ్ము అని, అందుకే వద్దని చెప్పానని అన్నారు.
Recommended Video
ఖండించిన హరీష్ రావు
వంటేరు చేసిన వ్యాఖ్యలపై హరీష్ రావు కూడా అంతే ఘాటుగా స్పందించారు. తనపై చేసిన ఆరోపణలను నిరూపించకుంటే వంటేరుపై తాను చట్టపరమైన చర్యలు తీసుకుంటానని చెప్పారు. తాను జీవితాంతం టీఆర్ఎస్లోనే ఉంటానని, చివరి శ్వాస వరకు కేసీఆర్ వెంటే నడుస్తానని చెప్పారు. కనీసం సర్పంచ్ సీటు కూడా గెలవలేననే ఉద్దేశ్యంతోనే వంటేరు ప్రతాప్ రెడ్డి ఇలాంటి జిమ్మిక్కులు చేస్తున్నారని విమర్శించారు. తనపై చేసిన ఆరోపణలను నిరూపించకుంటే రాజకీయంగా వంటేరు ప్రతాప్ రెడ్డి అంతు చూస్తానని హరీష్ రావు హెచ్చరించారు. అతని మాటలను ప్రజలు ఎవరూ నమ్మడం లేదన్నారు. గోబెల్స్ ప్రచారాలతో రాజకీయాలు నడవవని చెప్పారు. వంటేరు ప్రతాప్ రెడ్డి ఏ ఎండకు ఆ గొడుకు పట్టే అవకాశవాది అన్నారు. తనపై చేసిన ఆరోపణలను ఖండిస్తున్నానని చెప్పారు. ఆధారాలు చూపకుంటే ఊచలు లెక్కపెట్టిస్తా అన్నారు. గజ్వెల్ ప్రజలకు ఒంటేరు ప్రతాప్ రెడ్డి సంగతి తెలిసిపోయిందని, ఆయన డిపాజిట్లు గల్లంతయ్యే వరకు తాను గజ్వెల్ నియోజకవర్గంలోనే ఉంటానని హరీష్ రావు చెప్పారు. వంటేరు సంగతి తేల్చాకే గజ్వెల్ నుంచి వెళ్తానని చెప్పారు. తాను వారం రోజులుగా గజ్వెల్లో మకాం వేసి ప్రచారం చేస్తుంటే పునాదులు కదిలిపోయాయని, డిపాజిట్ వచ్చే పరిస్థితి లేదని, మూడోసారి ఓడిపోతున్నాడని చెప్పారు. తనపై చేసిన వ్యాఖ్యలను నిరూపించాలని లేదంటే బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.